నీరజ్కు చుర్మా తినిపించిన తల్లి
నీరజ్ చోప్రా తల్లి సరోజాదేవి తన కొడుకును చూసేందుకు చాలా సేపటి నుంచి ఎదురుచూస్తూ కూర్చున్నది. నీరజ్ విమానం దిగి రాగానే వెంటనే అతడిని కౌగిలించుని ఆశీర్వాదం అందజేసింది. ఎయిర్పోర్టులోనే కొడుకుకు ఎంతో ఇష్టమైన చుర్మా తినిపించింది. నీరజ్ సోదరి సంగీత సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. సోదరుడిని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరించింది. నీరజ్ తండ్రి కూడా చాలా సంతోషంగా కనిపించారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు నీరజ్కు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వారితో సెల్ఫీలు దిగారు.
క్రీడాకారులకు కరోనా పరీక్షలు
విమానాశ్రయంలోనే క్రీడాకారులకు ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారు అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి హోటల్ అశోకాకు బయల్దేరి వెళ్లారు. హోటల్ అశోకా వద్ద భారత ఒలింపిక్ అసోసియేషన్, క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు క్రీడాకారులకు ఘనంగా స్వాగతించి పతకాలు గెలిచిన అథ్లెట్లను సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, మాజీ క్రీడా శాఖ మంత్రి అయిన కిరణ్ రిజిజు భావోద్వేగానికి గురయ్యారు. మెడల్ విన్నర్స్ అందరికి ధన్యవాదాలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ విజయాలతో యావత్ దేశం సంబురం చేసుకుందన్నారు. ఇక సింధుకు ఐస్ క్రీమ్, నీరజ్ చోప్రాకు చపాతి చుర్మా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తినిపిస్తానని కేంద్రమంత్రి అనురాగ్ శర్మ మాట ఇచ్చారు. పతక విజేతలైన నీరజ్ చోప్రా, లవ్లీనా, రవి దహియా, బజరంగ్ పూనియాలతో భారత హకీ పురుషులు, మహిళల టీమ్లను ఘనంగా సన్మానించారు. మహిళల టీమ్ పతకం తేకపోయినా వారి పోరాటం అద్భుతమని కొనియాడారు.
కేక్ కట్ చేసి హాకీ టీమ్ సంబరాలు
అంతకు ముందు భారత పురుషుల, మహిళల హాకీ జట్లు అశోక హోటల్లో వేడుకలు జరుపుకున్నాయి. హోటల్లో ఇరు జట్లు కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకోగా, మహిళల హాకీ జట్టు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నది. కాంస్య పతక పోరులో బ్రిటన్ చేతిలో 4-3తో ఓడిపోయింది. కాగా, పతకం గెలిచిన మరునాడు మీరాబాయి చాను, పీవీ సింధూలు భారతదేశానికి చేరుకున్నారు.


Click it and Unblock the Notifications












