
హాకీ అమ్మాయిలు సాహో..
లీగ్ దశలో వరుసగా.. చిత్తుగా మ్యాచులు ఓడిన భారత అమ్మాయిలు ఆపై వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సోమవారం వరల్డ్ నెంబర్ 2 ఆస్ట్రేలియాను 1-0తో మట్టికరిపించి ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దుర్భేద్యమైన డిఫెన్స్కు మారుపేరైన ఆసీస్పై భారత మహిళలకు ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్ లభించింది. 22వ నిమిషంలో దొరికిన ఈ బంగారు అవకాశాన్ని గుర్జీత్ కౌర్ అందిపుచ్చుకొని గోల్గా మలిచింది. దాంతో భారత్ 1-0తో లీడ్లోకి వెళ్లింది. ఇక భారత గోల్కీపర్ సవిత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆసీస్ చేసిన 9 దాడులను సహచరులతో కలిసి ఆమె నిలువరించింది. ఏడు పెనాల్టీ కార్నర్లు, రెండు ఫీల్డ్ గోల్స్ను అడ్డుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. బుధవారం జరిగే సెమీస్లో అర్జెంటీనాతో భారత్ మహిళల టీమ్ తలపడనుంది.

కమల్ ప్రీత్6
ఒలింపిక్స్లో భారత్కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన డిస్కస్ త్రో అథ్లెట్ కమల్ప్రీత్ కౌర్ ఫైనల్స్లో విఫలమైంది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటీల్లో ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించిన కమల్ప్రీత్ శనివారం జరిగిన సెమీఫైనల్స్లో 64 మీటర్లతో అత్యద్భుత ప్రదర్శన చేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆ ప్రదర్శనను కూడా అందుకోలేకపోయింది. మొత్తం ఆరుసార్లు డిస్కస్ విసిరిన కమల్ప్రీత్ అత్యుత్తమంగా 63.70 మీటర్లే విసిరింది. దాంతో 6వ స్థానంతో సరిపెట్టుకుంది.

ప్చ్.. గుర్రపు స్వారీలోనూ దక్కని మెడల్..
టోక్యో ఒలింపిక్స్లో పతకం వస్తుందని ఆశలు రేకెత్తించిన మరో ఈవెంట్ ఈక్వెస్ట్రియన్. భారత ఆటగాడు ఫవాద్ మీర్జా ఫైనల్కు అర్హత సాధించినా చివరి పోరులో ఓడిపోయాడు. ఈ క్రీడలో భారత్ నుంచి వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన మొదటి ఆటగాడు అతడే కావడం గమనార్హం. అయితే, 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ ఈక్వెస్ట్రియన్లో రెండు దశాబ్దాలుగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు ఫవాద్ మాత్రమే. ఇంతియాజ్ అనీస్ (సిడ్నీ 2000), దివంగత వింగ్ కమాండర్ ఐజే లాంబా (అట్లాంటా 1996) అంతకుముందు ఒలింపిక్స్లో పాల్గొన్నారు.

ఒకటిన్నర సెకను వ్యవధిలో..
మహిళల 200 మీటర్ల హీట్-4 పరుగుపందెంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ నిరాశపరిచింది. కెరీర్ బెస్ట్ టైమింగ్ నమోదు చేసినా ద్యుతీ ముందంజ వేయలేకపోయింది. 23:85 టైమింగ్తో ఏడో స్థానంలో నిలిచింది. ఒకటిన్నర సెకెను వ్యవధిలో ద్యుతీచంద్ సెమీ ఫైనల్స్లో చోటు దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది.
టోక్యోలో మెడల్ లేకుండానే భారత షూటర్ల ప్రస్థానం ముగిసింది. సోమవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో సంజీవ్, ప్రతాప్ సింగ్ తీవ్రంగా నిరాశపరిచారు. 21, 31వ స్థానాలతో సరిపెట్టుకొని ఇంటిదారిపట్టారు.


Click it and Unblock the Notifications
