
టోక్యో: భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. బ్రిటన్ జట్టు ఐర్లాండ్ను 2-0 గోల్స్ తేడాతో ఓడించడంతో భారత్ క్వార్టర్ ఫైనల్లో ఆడే అవకాశం దక్కినట్లైంది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్కు చేరుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ఐర్లాండ్ గెలిచి ఉంటే.. అప్పుడు భారత్ నిష్క్రమించేది.
ఒలింపిక్స్ క్రీడలు మొదలైనప్పటి నుంచి ఇది మూడోసారి మాత్రమే. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ టీమ్ చివరిగా క్వార్టర్ ఫైనల్స్లో ఆడింది.
టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు మొదటి మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలై.. చివరి రెండు మ్యాచ్లు గెలిచి క్వార్టర్ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆరు పాయింట్లతో గ్రూప్-ఏలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, గ్రూప్-ఏలో చివరి మ్యాచ్.. ఐర్లాండ్, బ్రిటన్ మధ్య జరిగే పోటీలో బ్రిటన్ గెలుపోటములపై భారత మహిళల జట్టు భవితవ్యం ఆధారపడినట్లయింది. ఐర్లాండ్పై బ్రిటన్ విజయం సాధించడంతో భారత్ క్వార్టర్స్కు చేరుకుంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా భారత్ ఈ దశకు చేరుకునేది. పూల్-ఎ టాప్-4లో నిలిచిన భారత్ సోమవారం పూల్-బిలోని టాపర్ ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 4-3 తేడాతో విజయం సాధించింది. ఇక ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఒక్క పాయింట్తో ముందడుగు వేసింది. వందన కతారియా హ్యాట్రిక్ గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ తరఫున ఒలింపిక్స్లో ఈ ఘనత సాధించిన తొలి హాకీ ప్లేయర్గా ఆమె చరిత్ర సృష్టించింది. 4, 17, 49వ నిమిషాల్లో వరుసగా గోల్స్ నమోదుచేసింది. మరోవైపు నేహా గోయల్ 32వ నిమిషంలో ఇంకో గోల్ సాధించింది. అలాగే దక్షిణాఫ్రికా జట్టులో టారిన్ గ్లాస్బీ 15వ నిమిషంలో, ఎరిన్ హంటర్ 30వ నిమిషంలో, మారిజెన్ మారాస్ 39వ నిమిషంలో గోల్స్ సాధించి గట్టి పోటీనిచ్చారు. అయితే వందన 49వ నిమిషంలో చివరి గోల్ సాధించడంతో భారత్ విజయం సాధించింది.