హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్లో ఖతర్నాక్ ఆటతో భారత హైజంపర్ తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. హైజంప్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్తో సత్తా చాటి ట్రాక్ అండ్ ఫీల్డ్లో తొలి మెడల్ అందించాడు. అంతేకాకుండా హై జంప్ ఈవెంట్లో పతకాన్ని అందించిన తొలి అథ్లెట్గా చరిత్రకెక్కాడు. 2.22 మీటర్ల ఎత్తు దూకి మూడో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 2.10 మీటర్ల హర్డిల్ను క్లియర్ చేసిన తేజస్విన్.. రెండో ప్రయత్నంలో 2.15 మీటర్లు, మూడో ప్రయత్నంలో 2.19 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 2.22 మీటర్లు క్లియర్ చేశాడు. ఇక 2.25 మీటర్లు ఎత్తు దూకడంలో విఫలమయ్యాడు. న్యూజిలాండ్కు చెందిన హమీష్ కెర్ గోల్డ్ సాధించగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమ్ముడు బ్రెండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు.
1st track and field medal this CWG for India 🇮🇳
— Soug (@sbg1936) August 3, 2022
Tejaswin Shankar wins bronze medal 🥉 in high jump with sensational jump of 2.22m!!!
Well done 👍
Many congratulations!!!
Hope many more to come ..#TejaswinShankar#HighJump#CommonwealthGames pic.twitter.com/ZQC4Rsu9I6
అయితే ట్రాక్ అండ్ ఫీల్డ్లో తొలి మెడల్ అందించిన తేజస్విన్ శంకర్.. కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడానికి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియ(ఏఎఫ్ఐ)తో పోరాటమే చేశాడు. అమెరికా స్టేట్ చాంపియన్షిప్స్లో పాల్గొన్నాడని, తేజస్విన్ శంకర్ను ఏఎఫ్ఐ కామన్వెల్త్ గేమ్స్కు ఎంపిక చేయలేదు. దాంతో అతను ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించాడు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు. యూఎస్ స్టేట్ ఛాంపియన్షిప్స్లో పాల్గొన్న తేజస్విన్ శంకర్, భారత్లో పాల్గొనలేదని ఏఎఫ్ఐ అధికారులు కోర్టులో వాదించారు.
అయితే యూఎస్లో పాల్గొన్నందుకు కాదు కానీ భారత అథ్లెట్ల కోటా ఎక్కువ ఉండటంతో తేజస్విన్ శంకర్ని పంపకూడదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ భావించినట్టు కోర్టు విచారణలో తేలింది.
ఈ కారణంగా తేజస్విన్ శంకర్కు వీసా కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. లేట్ సెలక్షన్ కారణంగా కేవలం మూడు రోజుల ముందే బర్మింగ్హామ్ చేరుకున్న శంకర్.. తన ఆటతోనే అందరికి సమాధానం ఇచ్చాడు. అయితే కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డ తేజస్విన్.. వినూత్నంగా ప్రాక్టీస్ చేశాడు. జేఎల్ఎన్ గ్రౌండ్లో ఉండే మూడు వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత వాటితో కలిసి హై జంప్ చేయడం మొదలెట్టాడు. వీధి కుక్కలతో పోటీపడి మరీ హై జంప్ చేయడం ప్రాక్టీస్ చేసిన తేజస్విన్ శంకర్, ఎన్నో అవరోధాలు దాటుకుని కామన్వెల్త్ వేదికపై భారతదేశానికి మొట్టమొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకాన్ని అందించాడు.