దేశ రాజధాని న్యూఢిల్లీలో అండర్ 14, 16 క్రీడా టోర్నీలను రద్దు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యంపై చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అండర్ 16, అండర్ 14 ఇంటర్ జోనల్ క్రీడా టోర్నీలను నిర్వహించేందుకు సిద్దమవుతున్న ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాది అపరాజితా సింగ్ వేసిన పిటిషన్ను బీఆర్ గవాయ్-కే వినోద్ చంద్రన్ ధర్మాసనం బుధవారం విచారించింది.

ఈ కాలుష్యం మధ్య క్రీడా టోర్నీలు నిర్వహిస్తే.. పిల్లలను గ్యాస్ చాంబర్స్లో పెట్టినట్లవుతుందని, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యం తగ్గేవరకు పాఠశాలల్లో క్రీడా టోర్నీలు నిర్వహించవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఈ టోర్నీలు నిర్వహించాలని సూచించింది. అవసరమైతే కాలుష్యం తగ్గే వరకు టోర్నీలను వాయిదా వేయాలని పేర్కొంది. ఈ మేరకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్కు సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం తీవ్రంగా ఉండే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎలాంటి క్రీడా ఈవెంట్స్ నిర్వహించవద్దని పేర్కొంది.