ఒలింపిక్ గోల్డ్మెడలిస్ట్, భారత బళ్లెం వీరుడు నీరజ్ చోప్రాకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో వరుసగా రెండు పతకాలు అందించిన నీరజ్ చోప్రాకు భారతీయ సైన్యం గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నర్ హోదాను అందజేసింది. ఈ హోదాను భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం నీరజ్ చోప్రాకు ప్రదానం చేశారు.
ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి నీరజ్ చోప్రా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించారు. నీరజ్ చోప్రా.. పట్టుదల, దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు. అతని విజయాలు అసాధారణమైనవని, దేశానికి ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. రాబోయే తరాలకు నీరజ్ చోప్రా స్ఫూర్తిగా నిలుస్తారని, పట్టుదల, క్రమశిక్షణకు ఆదర్శప్రాయుడని మెచ్చుకున్నారు.

2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సాధించాడు. అథ్లెటిక్స్ విభాగంలో గోల్డ్తో పాటు సిల్వర్ మెడల్ అందించిన భారత క్రీడాకారుడిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. నీరజ్ చోప్రా 2016లో సుబేదార్గా భారత ఆర్మీలో చేరాడు. సుబేదార్ నుంచి 2021లో మేజర్గా పదోన్నతి సాధించాడు. 2022లో 'పరమ విశిష్ట సేవా' పతకంతో కేంద్ర ప్రభుత్వం అతన్ని సత్కరించింది. ఇప్పుడు మేజర్ నుంచి లెప్టినెంట్ కల్నల్గా హోదా అందుకున్నారు. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ను 2021లో స్వీకరించిన నీరజ్ చోప్రా.. 2022లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్లు కూడా భారత సైన్యం నుంచి గౌరవ లెఫ్ట్నెంట్ కల్నల్ హోదా అందుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి 2011లో భారత ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ప్రదానం చేసింది. ఇది క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా దక్కింది. ధోనీ పారాట్రూపర్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ ట్రైనింగ్లో అర్హత కూడా సాధించాడు. 2019 వన్డే ప్రపంచకప్ పరాజయం అనంతరం.. ధోనీ తన బెటాలియన్తో కలిసి కాశ్మీర్ లోయలో దాదాపు 15 రోజుల పాటు పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ వంటి విధుల్లో పాల్గొన్నాడు. ఇది అతని అభ్యర్థన మేరకు ఆర్మీ హెడ్క్వార్టర్స్ అనుమతి ఇచ్చింది.