హైదరాబాద్: కరోనా అడ్డంకులను ధాటుకొని ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నాయి. టిక్... టిక్... టిక్... అంటూ ఈ సమ్మర్ గేమ్స్కు మరికొద్ది గంటల్లో జేగంట మోగనుంది. అయితే ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచిన భారతావణికి సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ వినూత్నంగా విషెస్ చెప్పింది. చీర్ ఫర్ ఇండియా అంటూ పతకాల మోత మోగించాలని ఆకాంక్షించింది. తమ అధికారిక ట్విటర్ అకౌంట్లో తమ ఆటగాళ్ల ఫొటోలను టోక్యో బరిలో నిలిచే అథ్లెట్లుగా మార్చి మరి మద్దతు తెలిపింది.
అబ్దుల్ సమద్ను బ్యాడ్మింటన్ ప్లేయర్గా మార్చిన సన్రైజర్స్.. ప్రియమ్ గార్గ్ను జావెలిన్ త్రోయర్గా.. జగదీష్ సుచిత్ను స్ప్రింటర్గా.. షబాజ్ నదీమ్ను స్విమ్మర్గా మార్చేసి ట్వీట్ చేసింది. టోక్యో బరిలో నిలిచిన భారత ఆటగాళ్లకు మద్దతు పలకాలని తమ అభిమానులకు పిలుపునిచ్చింది. ఈ వినూత్న ట్వీట్పై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. సూపర్ మామా అని ఒకరంటే.. నీ క్రియేషన్ అదిరిపోయిందిపో అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.
Dear #OrangeArmy, it is time to cheer for #TeamIndia at #Tokyo2020, 🔊 LOUD AND CLEAR! 🇮🇳📣#Cheer4India #OrangeOrNothing pic.twitter.com/BYwIuUMNsB
— SunRisers Hyderabad (@SunRisers) July 22, 2021
టోక్యో ఒలింపిక్స్లో మొత్తం 18 క్రీడాంశాల్లో 119 మంది భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటం... మేటి క్రీడాకారులను మట్టికరిపిస్తూ పతకాలు కొల్లగొడుతుండటంతో... టోక్యో ఒలింపిక్స్లో మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూలేని విధంగా ఈసారి ఒలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుందని అందరూ విశ్వసిస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్ను భారత్లో సోనీ నెట్వర్క్తోపాటు దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. సోనీ టెన్ 1, 3, 4 చానెల్స్లో ఈ సమ్మర్ గేమ్స్ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక సోనీ లివ్ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ వేదికగా మొబైల్లో మ్యాచ్లు చూడవచ్చు. ఫ్రీగా చూడాలనుకునేవారు జియో టీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు. జియో టీవీ నుంచి సోనీటెన్ చానల్స్ను ఎలాంటి రుసుము లేకుండా వీక్షించవచ్చు. దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్లో కూడా ఉచితంగానే చూడవచ్చు.