న్యూఢిల్లీ: వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులు, కోచ్లకు ప్రతీ ఏటా కేంద్రం అందిచే క్రీడా పురస్కారాల నామినేషన్లను ఈ ఏడాది ఈ-మెయిల్ ద్వారా స్వీకరిస్తున్నట్లు కేంద్ర క్రీడాశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఖేల్ రత్న పురస్కారంతో పాటు.. ఇతర అవార్డుల సెలక్షన్ ప్రక్రియను కూడా ఆన్లైన్ ద్వారానే చేస్తున్నట్లు పేర్కొంది.
సాధారణంగా ప్రతీ ఏడాది ఏప్రిల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఈ ప్రక్రియ ముందుసాగలేదు. ఇక లాక్డౌన్ మే 17 వరకు పొడిగించగా.. నామినేషన్ల స్వీకరణ జూన్ 3వ తేదీతో ముగియనుంది.
దీంతో దరఖాస్తు హార్డ్ కాపీలు అవసరం లేదని, స్కాన్ కాపీలను రికమెండ్ చేస్తున్న అథారిటీ, దరఖాస్తుదారుడి సంతకంతో చివరి తేదీ లోపు పంపించాలని కేంద్ర క్రీడాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే నామినేషన్లను స్వీకరించమని, దానికి క్రీడాశాఖ ఎలాంటి బాధ్యత వహించదని స్పష్టం చేసింది.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్చంద్ పురస్కారాలు నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల కిందకు వస్తాయి. ఆయా క్రీడా రంగాల నుంచి ఆటగాళ్లను పెట్టుకున్న దరఖాస్తులను కేంద్ర క్రీడా శాఖ నియమించిన కమిటీ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో దిగ్గజ క్రీడాకారులు, మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టులు ఉంటారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 46 వేలకు చేరగా.. 1459 మంది మరణించారు.