
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా క్రీడా రంగాన్ని కుదిపేసింది. ఇప్పటికే పలు టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు మానసికంగా కుంగిపోకుండా తమ ట్రైనింగ్ను కొనసాగించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. ఆటగాళ్లెవరూ స్థైర్యాన్ని కోల్పోవద్దని కోరారు. తమ ప్రాక్టీసును కొనసాగిస్తూ శిక్షణలపై దృష్టి కేంద్రీకరిస్తూ ముందుకెళ్లాలని ట్వీటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
'కరోనావైరస్ కారణంగా, క్రీడా కార్యక్రమాలు, పోటీలు తాత్కాలికంగా వాయిదా పడుతున్నాయి, కానీ క్రీడాకారులందరూ స్థైరయాన్ని కోల్పోవద్దని, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలని కోరుతున్నా'అని ట్వీట్ చేశారు.
వారం క్రితం కొవిడ్-19 మహమ్మారిని నియంత్రించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అన్ని జాతీయ ఫెడరేషన్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల్ని పాటించాలన్నారు. క్రీడా కార్యక్రమాల సందర్భంగా భారీ జన సమూహాలకు దూరంగా ఉండాలని రిజిజు కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కొవిడ్-19 వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు దాదాపు 6వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షన్నర మందికి పైగా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీన్ని మహమ్మారిగా ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ - దక్షిణాఫ్రియా సిరీస్ రద్దవ్వడంతో పాటు ఐపీఎల్ కూడా వచ్చే నెల 15కు వాయిదా పడింది. అలాగే, షూటింగ్ ప్రపంచ కప్ పోటీలు, ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ పోటీలు సైతం పోస్ట్పోన్ అయ్యాయి.