రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందోళన వెనుక బీజేపీ నాయకురాలు, మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ హస్తం ఉందని స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆరోపించింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవి చేపట్టాలనే స్వార్థంతో బబితా ఫోగట్ రెజ్లర్లను రెచ్చగొట్టిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను వేధించాడని, అతనిపై కేసు నమోదు చేయాలని భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సుదీర్ఘ కాలం నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్తో పాటు బజరంగ్ పూనియా వంటి అగ్ర శ్రేణి రెజ్లర్లు పాల్గొన్నారు.

ఏడాదిగా నిరసనలు..
ఈ నిరసనల్లో భాగంగా భారత కొత్త పార్లమెంట్ భవన ప్రారంభ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పాటు తాము సాధించిన పతకాలను గంగలో వేసేందుకు కూడా రెజ్లర్లు సిద్దమయ్యారు. పోలీసుల చేతుల దెబ్బలు కూడా తిన్నారు. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. చివరకు ప్రభుత్వం తలొగ్గి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష బాధ్యతల నుంచి బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ను తప్పించడంతో పాటు అతనిపై కేసు నమోదు చేయించింది.
ఇటీవల వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో రెజ్లర్ల నిరసన వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ ఆరోపించాడు.
కాంగ్రెస్ కాదు.. బీజేపీ నేత కుట్ర..
అయితే తాజాగా ఈ వ్యహారంపై ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడిన సాక్షి మాలిక్.. సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ నిరసనల వెనుక బీజేపీ నేత, మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ హస్తం ఉందని, ఆమెనే ఆందోళనలు చేపట్టాలని రెజ్లర్లకు సూచించిందని పేర్కొంది. 'రెజ్లర్ బబితా ఫోగట్.. రెజ్లర్లందరినీ సమావేశపరిచి డబ్ల్యూఎఫ్ఐలో జరుగుతున్న అవినీతి, దోపిడీ, రెజ్లర్లకు ఎదురవుతున్న సమస్యలను వివరించింది.
వీటిపై గళం వినిపించాలని కోరింది. స్వార్థపూరితంగా బబితా రెజ్లర్లను రెచ్చగొట్టింది. ఇప్పుడు ఈ నిరసనలకు పార్టీ రంగులు పులుముతున్నారు. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. బీజేపీ నేతలు బబితా ఫోగట్, తీరత్ రాణా.. ఆందోళనలు చేపట్టేలా రెజ్లర్లను రెచ్చగొట్టారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవి చేపట్టాలనే ఆకాంక్షతో బబితా ఫోగట్ ఇదంతా చేశారు.'అని సాక్షి మాలిక్ చెప్పుకొచ్చింది.