దేశంలో క్రికెటర్లకు లభించే ఆదరణ, సౌకర్యాలను ఇతర క్రీడాకారులకు కల్పిస్తే ఒలింపిక్స్లో భారత్ పతకాల మోత మోగిస్తుందని, చైనా, అమెరికాలను అధిగమిస్తోందని భారత వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ అన్నారు. క్రికెట్లా ఇతర క్రీడలను కూడా ఆదరించాల్సిన అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా హోస్ట్.. చైనా, అమెరికా, ఆస్ట్రేలియాలా ఒలింపిక్స్లో భారత్ ఎందుకు రాణించలేకపోతుందని సైనాను ప్రశ్నించాడు. ఆమె వెంటనే భారత్లో ఎన్ని క్రికెట్ అకాడమీలు ఉన్నాయి? బ్యాడ్మింటన్ ట్రైనింగ్ సెంటర్స్ ఎన్ని? అని బదులు ప్రశ్నించారు.

హోస్ట్ వెంటనే క్రికెట్కు చాలా అకాడమీలు ఉన్నాయని చెప్పాడు. ఒలింపిక్స్లో భారత్ రాణించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని సైనా నెహ్వాల్ తెలిపారు. క్రికెట్కు సంబంధించి అన్లిమిటెడ్ అకాడమీలున్నాయని చెప్పారు. అంతేకాకుండా క్రికెటర్లకు అత్యుత్తమైన సౌకర్యాలు లభిస్తున్నాయని గుర్తు చేసారు. మహమ్మద్ షమీ తీవ్రంగా గాయపడినప్పుడు అతనికి అద్భుతమైన ట్రీట్మెంట్ ఇప్పించారని తెలిపారు.
ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్కు కూడా అండగా ఉన్నారని, అతను మళ్లీ రీఎంట్రీ ఇచ్చేలా మోటీవేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. క్రికెట్లో బెస్ట్ డాక్టర్లు, ఫిజియోలు, కోచ్లు ఉన్నారని, ఇతర క్రీడల్లో కూడా ఆ సౌకర్యాలు కల్పిస్తే.. ఒలింపిక్స్లో చైనా, అమెరికాలా భారత్ పతకాల మోత మోగిస్తుందని చెప్పారు. క్రికెట్ కంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్ శారీరకంగా కష్టంగా ఉంటాయని సైనా నెహ్వాల్ అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై కేకేఆర్ ప్లేయర్ రఘువంశీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'బుమ్రా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తే సైనా తట్టుకోగలదో లేదో చూడాలి'అని ట్వీట్ చేశాడు. కాసేపటికే ఈ పోస్ట్ను తొలగించారు. కానీ అప్పటికే ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
దీనిపై సైనా తనదైన శైలిలో స్పందించింది. 'నువ్వు కోహ్లీ ఎలా అవుతావు? లేకపోతే రోహిత్లా అవ్వగలవా? చాలామంది క్రికెటర్లు వారిలా కావాలని కోరుకుంటారు. కానీ, అందరూ కావడం చాలా కష్టం. కొందరు మాత్రమే ఆ స్థాయికి చేరుకోగలరు. అదంతా నైపుణ్యంపై ఆధారపడిన గేమ్. ఇక బౌలర్ల సంగతంటావా? వారి కష్టం నాకు తెలుసు.
అసలు నేను ఎందుకు బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొంటాను? ఒకవేళ నేను 8 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడితే కచ్చితంగా బుమ్రా పేస్కు సమాధానం చెప్పేవాడిని. బుమ్రా బ్యాడ్మింటన్ ఆడితే నా స్మాష్లను ఆడగలడా? దేశం కోసం ఆడేటప్పుడు ఇలాంటి విషయాల గురించి ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రికెట్లా ఇతర క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదే నా ఉద్దేశం'అని సైనా చెప్పుకొచ్చింది.