
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ విజయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత హాకీ దిగ్గజం ధ్యాన్చంద్కు అరుదైన గౌరవం కల్పించింది. క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును ధ్యాన్చంద్ ఖేల్రత్నగా మార్చింది. ఈ పేరు మార్పుపై ఎన్నో రోజులుగా వాదనలు జరుగుతున్నా.. డిమాండ్లు వచ్చినా ఏ ప్రభుత్వం సాహిసించలేదు. కానీ గురువారం జరిగిన కాంస్యపోరులో జర్మనీపై భారత పురుషుల హాకీ జట్టు సాధించిన విజయం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు. దేశప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
'ఎన్నో రోజులుగా ఖేల్ రత్న అవార్డుకు హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ పేరు పెట్టాలనే వాదన వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు ఈ విషయంపై ఎన్నో రోజులుగా నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు. వారి సెంటిమెంట్ను గౌరవిస్తూ ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్చంద్ పేరు పెట్టాం. ఇక నుంచి మనమంతా ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డని పిలవాలి. ఈ సలహా ఇచ్చివారందరికి ధన్యవాదాలు'అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ అవార్డు అందజేస్తారనే విషయం తెలిసిందే.
1991-1992లో ఖేల్రత్న అవార్డును తీసుకురాగా.. ఈ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్. ఆ తర్వాత లియాండర్ పేస్, సచిన్ టెండూల్కర్, ధన్రాజ్ పిళ్లై, పుల్లెల గోపీచంద్, అభినవ్ బింద్రా, అంజు బాబీ జార్జ్, మేరీ కోమ్, రాణీ రాంపాల్ అందుకున్నారు. ఈ అవార్డును అందుకునే క్రీడాకారులకు రూ.25 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు.
హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1926 నుంచి 1949 వరకు ఆయన భారత హాకీ టీమ్కు ప్రాతినిథ్యం వహించారు. 23 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో 400 గోల్స్ సాధించారు. అలహాబాద్కు చెందిన ధ్యాన్ చంద్.. 1928, 1932, 1936 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడు. ఇక ఖేల్ రత్న అవార్డు తర్వాత దేశ అత్యున్నత పురుస్కారంగా భావించే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ధ్యానచంద్ అవార్డుగా పిలుస్తారు. 2002లో ఈ అవార్డును ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలోని జాతీయ స్టేడియం పేరును కూడా ధ్యాన్చంద్ పేరిట మార్చారు.