
ఏం జరిగిందంటే...
ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్లతో సుశీల్ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సోనూ, అమిత్ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతడు తప్పించుకొని తిరిగాడు. దాదాపుగా మూడు వారాలు పోలీసులు అతడికి కోసం వెతికారు.

స్కూటర్పై వెళ్తూ..
ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్ 14 వేర్వేరు సిమ్ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆఖరికి ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులో తన అనుచరుడు అజయ్తో కలిసి స్కూటర్పై వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు సుశీల్ చిక్కాడు.

కెరీర్ ఖేల్ ఖతమ్!
అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన 37 ఏళ్ల సుశీల్ కుమార్ పరువు, ప్రతిష్ట తాజా ఉదంతంతో మసకబారిపోయింది. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన సుశీల్... తాజా సంఘటనతో భవిష్యత్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడిందనే చెప్పాలి. 2019 ప్రపంచ చాంపియన్షిప్ లో చివరిసారి భారత్కు ప్రాతినిధ్యం వహించిన సుశీల్ 20వ స్థానంలో నిలిచాడు.

ఉరి తీయాలి..
తమ కుమారుడి మృతికి కారణమైన రెజ్లర్ సుశీల్ కుమార్ను ఉరితీయాలని సాగర్ రాణా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసును న్యాయంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని అతడు తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తాడని ఆరోపించారు. అతడి వద్ద నుంచి పతకాలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నేరస్థులతో సుశీల్ సంబంధాలపై దర్యాప్తు చేయాలని సాగర్ తండ్రి అశోక్ కోరారు. 'న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. పారిపోయినప్పుడు సుశీల్ ఎక్కడున్నాడు? అతడికి ఎవరు ఆశ్రయమిచ్చారు? గ్యాంగ్స్టర్లతో అతడికున్న సంబంధాలపై దర్యాప్తు చేయాలి. అతడిని ఉరి తీయాలి. తన సొంత విద్యార్థులనే చంపేవారికి అదో పాఠం కావాలి' అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications












