జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్లో తెలుగు టాలన్స్ టీమ్ జోరు కొనసాగుతోంది. వరుస గెలుపులతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో తెలుగు టాలన్స్ 33-22 తేడాతో రాజస్థాన్ పాట్రియాట్స్పై విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన తెలుగు టాలన్స్.. ఐదు విజయాలతో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. వరుస విజయాలతో జోరు మీదున్న టాలన్స్.. రాజస్థాన్ పాట్రియాట్స్పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ వరుస గోల్స్తో హోరెత్తించింది.

తెలుగు టాలన్స్ ప్లేయర్లు దేవిందర్ సింగ్ భుల్లార్, నసీబ్ సింగ్, రఘు, అనిల్, రాహుల్, మోహిత్ సత్తా చాటాడు. గోల్ కీపర్ రాహుల్ కళ్లు చెదిరే రీతిలో రెండు సార్లు పాయింట్లను కాపాడాడు. చివరి 10 నిమిషాల్లో 10 గోల్స్ కొట్టిన టాలన్స్ తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం జరిగే మ్యాచ్లో తెలుగు టాలన్స్.. గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్తో తలపడనుంది.
మొత్తం ఆరు జట్ల మధ్య ఈ హ్యాండ్బాల్ లీగ్ జరుగుతుండగా.. జియో సినిమాతో పాటు స్పోర్ట్స్ 18 చానెల్లో మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం వస్తోంది. జూన్ 25న ఈ టోర్నీ ఫైనల్ జరగనుండగా.. 6 విజయాలతో మహారాష్ట్ర ఇరోన్మెన్ సెమీస్కు అర్హత సాధించింది. మరో విజయం సాధిస్తే తెలుగు టాలాన్స్ కూడా సెమీస్ చేరనుంది.