చెన్నై: చెస్ ప్రపంచకప్లో సంచలన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించిన భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానందకు ఘన స్వాగతం లభించింది.ఇటీవల ముగిసిన చెస్ ప్రపంచకప్ ఫైనల్లో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ప్రజ్ఞానంద పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానందకు చెన్నై విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ప్రజ్ఞానంద అంటూ గట్టిగా అరుస్తూ.. జేజేలు పలికారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ను ఆయన నివాసంలో తన కుటుంబసభ్యులతో ప్రజ్ఞానంద కలిశాడు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రజ్ఞానందపై ప్రశంసల జల్లు కురిపించారు. తమిళనాడుతోపాటు యావత్ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన కనబర్చిన ప్రజ్ఞానందను సీఎం ప్రత్యేకంగా అభినందించాడు.

ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కును అందించి మెమెంటోను బహుకరించారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాశాఖ ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రజ్ఞానందను శాలువాతో సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రజ్ఞానంద అతని కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉదయనిధి స్టాలిన్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
'ప్రజ్ఞానందను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. గొప్ప విజయం సాధించిన తర్వాత తిరిగి చెన్నైకి వచ్చాడు. అతను సాధించిన విజయాలు తమిళనాడుతోపాటు యావత్ దేశానికి కీర్తిని తెస్తాయి. మున్ముందు కూడా అతను ఇదే ఆటతీరుతో అద్భుతమైన విజయాలు సాధించాలి'' అని ప్రజ్ఞానందను సత్కరిస్తున్న వీడియోను స్టాలిన్ ట్వీట్ చేశాడు.

ఫిడె చెస్ వరల్డ్ కప్లో రజత పతకం సాధించిన ప్రజ్ఞానందకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఓ బహుమతి ప్రకటించారు. అతని తల్లిదండ్రులు నాగలక్ష్మీ, రమేశ్ బాబుకు XUV400 ఈవీ కారును బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని ట్విటర్ వేదికగా తెలిపాడు.