పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత హాకీ టీమ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వయంగా ఫోన్ చేసి ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు సాధించిన విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ను సర్పంచ్ సాబ్ అని సంభోదిస్తూ ప్రత్యేకంగా అభినందించారు.
హర్మన్ప్రీత్ సింగ్ను జట్టులో ముద్దుగా సర్పంచ్ సాబ్ అని పిలుస్తుంటారు. సర్పంచ్ అంటే ముందుండి నడిపించే నాయకుడని అర్థం. హాకీ టీమ్ కెప్టెన్ అయిన అతన్ని సహచర ఆటగాళ్లంతా సర్పంచ్ సాబ్ అని పిలుచుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం 'శభాష్ సర్పంచ్ సాబ్'అని హర్మన్ప్రీత్ సింగ్ను కొనియాడాడు.

కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. భవిష్యత్తులో భారత హాకీటీమ్ మరింత అభివృద్ధి చేసేలా కృషి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంపై ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పతకాలు గెలిచిన అథ్లెట్లకు ఫోన్ చేసి ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. టోక్యో ఒలింపిక్స్ నుంచే ఆయన ఇలా చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. మెడల్ గెలిచిన ప్రతీ అథ్లెట్, టీమ్తో మోదీ స్వయంగా మాట్లాడుతున్నారు. గురువారం జరిగిన కాంస్య పోరులో భారత్ 2-1తో స్పెయిన్ను ఓడించి వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించింది.
ఈ కాంస్య పోరులో హర్మన్ప్రీత్ సింగ్(29వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 10 గోల్స్ నమోదు చేసి ఈ ఒలింపిక్స్లోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ సైతం అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. స్పెయిన్కు లభించిన 9 పెనాల్టీ కార్నర్స్లో ఎనిమిదింటిని అద్భుతంగా అడ్డుకున్నాడు. భారత్కు లభించిన 6 పెనాల్టీ కార్నర్స్లో రెండింటిని హర్మన్ప్రీత్ సింగ్ గోల్స్గా మలిచాడు. ఈ విజయంతో పీఆర్ శ్రీజేష్ తన కెరీర్కు వీడ్కోలు పలికాడు.
ఒలింపిక్స్లో భారత హాకీ టీమ్ వరుసగా రెండు పతకాలు గెలవడం 52 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత్ చివరిసారిగా 1968, 1972 ఒలింపిక్స్ గేమ్స్లో కాంస్య పతకాలు సాధించింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ 2020, పారిస్ ఒలింపిక్స్ 2024 బ్రాంజ్ మెడల్స్ అందుకుంది.