న్యూఢిల్లీ: భారత క్రీడల్లో స్వర్ణ యుగం మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ గేమ్స్లో మెడల్స్తో మెరిసిన భారత క్రీడాకారులతో ప్రధాని తన నివాసంలో శనివారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ఒకరిద్దరూ మినహా కామన్వెల్త్ విజేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. అథ్లెట్లపై ప్రశంసల జల్లు కురిపించారు. వారు సాధించిన అపూర్వ విజయాలు చూసి యావత్ దేశం గర్విస్తోందన్నారు.
'మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని కేటాయించి నా నివాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు భారతీయుల్లాగే.. మీ గురించి మాట్లాడటం నాకూ గర్వంగా ఉంది. భారత క్రీడల్లో స్వర్ణ యుగం ఆరంభమైంది. ఇది కేవలం యువ శక్తి వల్లే సాధ్యమైంది. గడిచిన రెండు వారాల్లో రెండు మెగా ఈవెంట్లు జరిగాయి. ఓ వైపు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతుంటే.. మరోవైపు తొలిసారి చెస్ ఒలింపియాడ్కు ఆతిథ్యం ఇచ్చాం. ఈ మెగా ఈవెంట్స్లో విజయం సాధించిన వాళ్లందరికీ కూడా నా శుభాభినందనలు.'అని ప్రధాని మోదీ విజేతలను కొనియాడారు.
ఇక కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్మన్ప్రీత్ కౌర్ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఆయన.. స్వర్ణ పతక విజేత బాక్సర్ నీతూ ఘంఘస్, బ్మాడ్మింటన్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు, క్రికెటర్ రేణుకా సింగ్తో పాటు రెజ్లర్ పూజా గెహ్లోత్ పేర్లను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినపుడు గర్వంతో గుండె ఉప్పొంగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా యూకేకు బయల్దేరే ముందు కూడా క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. దేశాన్ని గర్వపడేలా చేస్తామని అప్పుడు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇక ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెజ్లింగ్లోనే మనకు 6 స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు వచ్చాయి.