
నీరజ్ ఇంట సంబరాలు..
ఈ విజయం నేపథ్యంలో నీరజ్ చోప్రా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్కు ప్రపంచ అథ్లెటిక్స్లో రెండో మెడల్ అందించి నీరజ్ 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. దీంతో నీరజ్ విజయం పట్ల అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. హర్యానాలోని పానిపట్లోని నీరజ్ ఇంట్లో కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుంటూ నృత్యాలతో హోరెత్తించారు. ఈ సందర్బంగా నీరజ్ తల్లి సరోజ్ చోప్రా మాట్లాడుతూ.. తన కుమారుడి కష్టానికి దక్కిన ప్రతిఫలమని పేర్కొన్నారు. చాలా ఆనందంగా ఉందన్నారు. గోల్డ్ గెలుస్తాడని అనుకున్నామని.. కానీ, తృటిలో చేజారిందంటూ నీరజ్ తాతయ్య ధరమ్సింగ్ చెప్పుకొచ్చారు.

రెండో స్థానంలో నిలిచి..
ఆదివారం జరిగిన ఫైనల్లో నీరజ్ చోప్రా 88.13 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు. తన తొలి త్రోను ఫౌల్తో ప్రారంభించిన నీరజ్.. రెండో ప్రయత్నంలో 82.39మీ విసిరి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. మూడో ప్రయత్నంలో మాత్రం 86.37 మీటర్లు విసిరాడు. ఇక నాలుగో ప్రయత్నంలో విసిరిన 88.13 మీటర్ల త్రోనే నీరజ్కు పతకం ఖాయం చేసింది. కాగా, తన అఖరి ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ త్రో చేశాడు. దీంతో నాలుగో ప్రయత్నంలో విసిన దూరాన్ని అత్యధికంగా లెక్కించారు. దాంతో రెండో స్థానంతో సరిపెట్టిన నీరజ్.. సిల్వర్ మెడల్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 మీటర్ల దూరం త్రో చేసి బంగారు పతకం గెలిచాడు.

తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా..
ఇదిలాఉంటే.. రజతం గెలిచిన నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్గా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2003లో పారిస్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్జ్ కాంస్య పతకం సాధించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో పతకం సాధించిన తొలి ప్లేయర్గా కూడా నీరజ్ రికార్డుకెక్కాడు.


Click it and Unblock the Notifications












