పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రారంభానికి ముందు భారత అధికారుల వీసా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్ వేదికగా పారాలింపిక్స్ జరగనుండగా.. అక్కడికి అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించిన 15 మంది భారత అధికారుల వీసా దరఖాస్తులను ఢిల్లీలోని ఫ్రెంచ్ ఎంబసీ తిరస్కరించింది.
ఈ వారం ప్రారంభంలో పారాలింపిక్స్ కోసం పారిస్ వెళ్లే 25 మంది అధికారులతో కూడిన జాబితాను పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) ప్రకటించింది. ఈ 25 మంది జాబితాలోని 15 మంది వీసాలను ఫ్రెంచ్ రాయబార కార్యాలయం రద్దు చేసింది. ఈ 15 మంది వ్యక్తులు ఆగస్ట్ 24-25 మధ్య ప్యారిస్ విమానం ఎక్కాల్సి ఉంది.

ఆశ్చర్యకరంగా అధికారుల వీసాలు జారీకి బాధ్యత వహించే పీసీఐ అధికారి పరుల్ మహాజన్ ఒబెరాయ్ ఈ ఘటనకు దూరంగా ఉన్నారు.పీసీఐ సెక్రటరీ జనరల్ జయంత్ జీహెచ్ సంతకంతో ఆ 25 మంది అధికారుల వీసా దరఖాస్తులను ఫ్రెంచ్ రాయబార కార్యలయానికి పంపారు. అయితే వీసా తిరస్కరణకు గురైన అధికారులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పీసీఐ స్పష్టం చేసింది.
'పీసీఐ అధికారులందరూ ఇక్కడ పారిస్లోనే ఉన్నారు. వారితో అంతా బాగానే ఉంది. ఇతర అధికారుల జాబితా గురించి నాకు తెలియదు'అని పారిస్ నుంచి పరుల్ మహాజన్ ఒబెరాయ్ మా మైఖేల్ ప్రతినిథితో ఫోన్లో తెలిపారు.
వీసా తిరస్కరణకు గురైన ప్రముఖుల్లో ప్రఖ్యాత వైద్య నిపుణుడు అరుణ్ మాథ్యూ ఉన్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) మెడికల్ టీమ్లో మాథ్యూ సభ్యుడిగా ఉన్నారు. ఆసియా పారాలింపిక్ కమిటీ మెడికల్ బోర్డులో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. వీసా తిరస్కరణ గురించి మాట్లాడేందుకు మాథ్యూను ఫోన్, మెసేజ్ల ద్వారా మా మైఖేల్ ప్రతినిథి సంప్రదించే ప్రయత్నం చేసినా ఆయన స్పందించలేదు.
పీసీఐ, క్రీడా మంత్రిత్వశాఖ ఆమోదించిన వైద్య సిబ్బంది జాబితాలో మాథ్యూ పేరు లేదు. అయినా అతను పారాలింపిక్స్ వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడనేది సందేహంగా మారింది. పారిస్ పారాలింపిక్స్కు వెళ్లేందుకు వైద్య సిబ్బందితో సహా మొత్తం 95 మంది అధికారులకు క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. వీరిలో ఇప్పటికే చాలా మంది పారిస్ చేరుకున్నారు.
ముందుగా పీసీఐ.. క్రీడా మంత్రిత్వశాఖకు పంపించిన జాబితాలో మాథ్యూ పేరును ప్రస్తావించలేదు. కానీ అయన వీసా కోసం అధికారిక లేఖను జారీ చేసింది. వీసా తిరస్కరణకు గురైన మరో అధికారి పంజాబ్కు చెందిన జస్ప్రీత్ సింగ్. వీసా తిరస్కరణ విషయాన్ని ఆయన అంగీకరించారు. కానీ పూర్తి వివరాలను పంచుకోవడానికి నిరాకరించారు. పారాలింపిక్స్ వెళ్లడం లేదని ఘాటుగా బదులిచ్చారు.
పేరు చెప్పడానికి ఇష్టపడని మరో అధికారి.. తన సొంత ఖర్చుతో పారిస్ వెళ్లే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. మరో పీసీఐ అధికారి మాత్రం వీసా ప్రక్రియను సులభతరం చేయడానికే తాము దరఖాస్తుదారులకు లేఖలు ఇచ్చామని, స్వంత విమానా చార్జీలు, వసతుల ఖర్చులను వారే భరించాలని తెలిపారు.
ఈ విషయంపై పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, పీసీఐ అధ్యక్షుడు దేవేంద్ర జాజారియాను సంప్రదించడానికి ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. ఓవైపు పారాలింపిక్స్ గేమ్స్కు క్రీడాకారులు సిద్దమవుతుంటే.. మరోవైపు ఈ వీసా కుంభకోణం అధికారుల పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తోంది.