పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత పారా స్ప్రింటర్, తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి కాంస్య పతకంతో సత్తా చాటింది. మంగళవారం జరిగిన మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరి ఫైనల్లో దీప్తి జీవాంజి 55.45 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. బరిలోకి దిగిన తొలి పారాలింపిక్స్లోనే పతకం సాధించింది.
ఉక్రెయిన్కు చెందిన వై షులియర్ 55.16 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించగా.. టర్కీకి చెందిన ఏ. ఓండర్ 55.23 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి సిల్వర్ మెడల్ సాధించింది.

సోమవారం జరిగిన హీట్-1లో దీప్తి జీవాంజీ 55.45 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచింది. రెండు హీట్స్ నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు, అలాగే ఫాస్టెస్ట్ టైమింగ్ నమోదు చేసిన మరో ఇద్దరితో కలిపి మొత్తం ఎనిమిది మంది ఫైనల్కు అర్హత సాధించారు. ఈ 8 మందిలో మూడో స్థానంలో నిలిచి జీవాంజీ కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
ఈ పారాలింపిక్స్లో దీప్తి జీవాంజీ తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ రికార్డు (55.07 సెకన్లు) ఆమె పేరిటే ఉంది. మేలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్లో ఈవెంట్లో దీప్తి ఈ వరల్డ్ రికార్డు సృష్టించింది. మరోసారి ఈ తరహా ప్రదర్శన చేసి ఉంటే దీప్తీ జివాంజీ బంగారు పతకం సాధించేది.
ఇక దీప్తి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. ఆమె నిరుపేద కుటుంబంలో మేధోపరమైన బలహీనతతో జన్మించింది. పరుగు పందెంలో రాణించిన దీప్తిని స్కూల్ పీఈటీ ప్రోత్సహించాడు.ఆ తర్వాత ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణతో ఆమె కథ మారిపోయింది. రమేశ్ ఆమెను హైదరాబాద్కు తీసుకొచ్చి గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్లో చేర్పించారు. ఆ తర్వాత శిక్షణలో దీప్తి రాటుదేలింది.
కోచ్ రమేశ్ శిక్షణతో, పుల్లెల గోపించంద్ అండతో ఆమె పారా అథ్లెట్గా పతకాల వేట కొనసాగిస్తోంది. ఆసియా పారా గేమ్స్ 400 మీటర్ల ఈవెంట్లో, వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలోనూ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించింది. వరల్డ్ చాంపియన్గా, వరల్డ్ రికార్డు హోల్డర్గా పారిస్ పారాలింపిక్స్లో బరిలోకి దిగి పతకం సాధించింది.