పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్కు మరో స్వర్ణ పతకం దక్కింది. పురుషుల హైజంప్ టీ64 ఈవెంట్లో ప్రవీణ్ కుమార్ బంగారు పతకంతో సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో 2.08 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతను ఆసియా రికార్డ్ను అధిగమించాడు.
అమెరికాకు చెందిన డెరెక్ లోసిడెంట్ 2.06 మీటర్ల ఎత్తు దూకి సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఉజ్బెకిస్థాన్ పారా అథ్లెట్ టెముర్బెక్ 2.03 మీటర్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. పారాలింపిక్స్ చరిత్రలో గోల్డ్ మెడల్ సాధించిన రెండో పారా హైజంపర్గా ప్రవీణ్ కుమార్ చరిత్ర సృష్టించాడు. అతనికన్నా ముందు మరియప్పన్ తంగవేలు లాంగ్జంప్లో స్వర్ణం సాధించాడు.

టోక్యోలో రజతం..
ప్రవీణ్ కుమార్కు ఇది రెండో పారాలింపిక్ మెడల్. టోక్యో పారాలింపిక్స్ 2020లో హైజంప్ టీ64 ఈవెంట్లో అతను సిల్వర్ మెడల్ సాధించాడు. ఏషియన్ పారా గేమ్స్లో స్వర్ణం సాధించిన అతను... పారిస్లో అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ప్రవీణ్ కుమార్ స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య 26కు చేరింది. ఇందులో 6 బంగారు పతకాలతో పాటు 9 సిల్వర్, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
పుట్టుకతోనే వైకల్యం..
ఉత్తరప్రదేశ్, నోయిడాలోని గోవింద్గర్కు చెందిన ప్రవీణ్ కుమార్ అంగవైకల్యంతో జన్మించాడు. అతనికి ఓ కాలు చిన్నగా ఉంటుంది. అంగవైకల్యంతో తీవ్ర ఇబ్బందులు పడిన అతను చిన్నప్పటి నుంచే వివిధ క్రీడలను ఆడటం ప్రారంభించాడు. వాలీబాల్ అంటే అతనికి చాలా ఇష్టం.
పారా అథ్లెటిక్ కోచ్ డాక్టర్ సత్యపాల్ సింగ్ సూచనలతో అతను పారా హైజంప్ క్రీడకు మారాడు. ఏషియన్ పారా గేమ్స్ 2022లో స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా ప్రతీ టోర్నీలోనూ పతకం సాధిస్తున్నాడు.