పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 8 పతకాలు సాధించిన భారత్.. మంగళవారం అర్థరాత్రి దాటాక మరో నాలుగు మెడల్స్లను ఖాతాలో వేసుకుంది. తెలంగాణ బిడ్డ, పారా స్ప్రింటర్ జీవాంజి దీప్తి కాంస్య పతకంతో మంగళవారం భారత్ ఖాతా తెరిచింది. మహిళల 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి జీవాంజి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని మూడో స్థానంలో నిలిచింది.
తద్వారా పారాలింపిక్స్లో పతకం సాధించిన తొలి పారా అథ్లెట్గా చరిత్రకెక్కింది. ఉక్రెయిన్కు చెందిన వై షులియర్ 55.16 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించగా.. టర్కీకి చెందిన ఏ. ఓండర్ 55.23 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి సిల్వర్ మెడల్ గెలుచుకుంది.

శరద్ కుమార్కు సిల్వర్..
పురుషుల హైజంప్ టీ-63 విభాగంలో శరద్ కుమార్ 1.88 మీటర్లతో సిల్వర్ మెడల్ సాధించగా.. తంగవేలు మరియప్పన్ 1.85 మీటర్లతో కాంస్యం దక్కించుకున్నాడు. తంగవేలు 2016 పారాలింపిక్స్లో స్వర్ణం, 2020 టోక్యోలో సిల్వర్ మెడల్ సాధించాడు.
మరోవైపు జావెలిన్ త్రో ఎఫ్-46 కేటగిరిలో అర్జిత్ సింగ్ సిల్వర్ మెడల్, గుర్జర్ సుందర్ సింగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. అర్జిత్ సింగ్ జావెలిన్ను 65.62 మీటర్ల దూరం విసరగా.. సుందర్ 64.96 మీటర్లు విసిరాడు. క్యూబా అథ్లెట్ గొంజాలెజ్ 66.14 మీటర్లతో స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు.
నిరాశపర్చిన పూజ, అవని..
ఆర్చరీలో పూజ జత్యన్ క్వార్టర్స్లోనే వెనుదిరిగింది. 27 ఏళ్ల పూజ 4-7తో చైనాకు చెందిన వు చున్యన్ చేతిలో ఓటమిపాలైంది. పారిస్ పారాలింపిక్స్లో రెండో పతకంపై కన్నేసిన షూటర్ అవని లేఖరాకు కూడా నిరాశే ఎదురైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలిచిన అవని.. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్హెచ్-1 విభాగంలో మెడల్ సాధించలేకపోయింది. ఫైనల్లో ఐదో స్థానానికే పరిమితమైంది.
పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో మహిళా షట్లర్ నిత్య శ్రీ కాంస్య పతకం గెలిచింది. మహిళల సింగిల్స్ ఎస్హెచ్-6 విభాగంలో నిత్య 21-14, 21-6 తేడాతో ఇండోనేసియా ప్లేయర్ ముర్లినా రీనాపై విజయం సాధించింది.
భారత్ సరికొత్త చరిత్ర..
ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 20కి చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్ చరిత్రలోనే భారత్ 20 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. టోక్యో పారాలింపిక్స్లో భారత్ 19 పతకాలు సాధించింది. మెడల్స్ టేబుల్లో చైనా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ 17వ స్థానంలో నిలిచింది.