పారిస్ పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు కేంద్ర క్రీడాశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ క్యాష్ ప్రైజ్ అందజేశారు. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన సన్మాన కార్యక్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పారా అథ్లెట్లే ఎక్కువ మంది ఉండగా.. స్వర్ణం గెలిచిన వారికి రూ. 75 లక్షలు, రజతం సాధించిన ప్లేయర్కు రూ. 50 లక్షలు, కాంస్యం దక్కించుకొన్న అథ్లెట్కు రూ. 30 లక్షల చెక్లను మర్సుఖ్ మాండవీయ
బహూకరించారు.
మిక్స్డ్ ఈవెంట్లలో పతకాలు సాధించిన ఆర్చర్ శీతల్ దేవి లాంటి వారికి రూ. 22.5 లక్షల ప్రైజ్మనీ లభించింది. గోల్డ్ మెడల్స్ సాధించిన జావెలిన్ త్రోయర్లు సుమీత్ అంటిల్, నవ్దీప్, క్లబ్ త్రోయర్ ధరమ్బీర్, ఆర్చర్ హర్వీందర్ సింగ్ రూ. 75 లక్షల నజరానాలు అందుకొన్న వారిలో ఉన్నారు. 2028 లాస్ ఏంజిల్స్లో జరిగే పారాలింపిక్స్కు కూడా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మర్సుఖ్ మాండవీయా అన్నారు.

'పారాలింపిక్స్లో భారత్ సత్తా చాటుతోంది. 2016 రియో పారాలింపిక్స్లో 4 పతకాలు సాధించిన భారత్.. టోక్యో క్రీడల్లో ఆ సంఖ్యను 19కి పెంచింది. పారీస్లో ఏకంగా 29 మెడల్స్తో 18వ స్థానానికి చేరుకుంది. 2028లో ఇంతకు మించి పతకాలు సాధిస్తాం'అని మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు. లాస్ ఏంజిల్స్ క్రీడల కోసం సన్నాహకాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని అథ్లెట్లకు ఆయన సూచించారు.
పారిస్ పారాలింపిక్స్లో భారత్ 7 బంగారు, 9 రజత, 13 కాంస్యాలతో మొత్తం 29 పతకాలు సాధించింది. గతవారమే స్వదేశానికి తిరిగి వచ్చిన షూటర్ అవనీ లేఖారా, పారా షట్లర్ నితేష్ కుమార్ తదితరులను ప్రభుత్వం ముందే సన్మానించిన విషయం తెలిసిందే. దాంతో వారు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
పారా అథ్లెట్లకు ఘన స్వాగతం
మంగళవారం స్వదేశానికి చేరుకొన్న పారా అథ్లెట్లకు ఘన స్వాగతం లభించింది. ఇందిరా గాంధీ విమానాశ్రయంలో వీరికి ఆహ్వానం పలకడానికి భారీ ఎత్తున అభిమానులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పతకాలు సాధించిన అథ్లెట్లకు పూలదండలు వేసి స్వీట్స్ తినిపించారు. స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నవ్దీప్ను ఫ్యాన్స్ పైకెత్తి సందడి చేశారు.