పారిస్ ఒలింపిక్స్ 2024లోనూ భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత అథ్లెట్లు 6 పతకాలతో సరిపెట్టారు. ఒక్క బంగారు పతకాన్ని కూడా సాధించలేకపోయారు. అంటే ఒక్క క్రీడలో కూడా భారత్ విజయం సాధించలేకపోయింది. ఒక రజతం, 5 కాంస్యాలతో పారిస్ ఒలింపిక్స్లో భారత్ ప్రస్థానం ముగిసింది.
భారత్ కంటే అతి తక్కువ జనాభా కలిగిన దేశాలు కూడా బంగారు పతకాలు సాధించాయి. చివరకు దాయాదీ పాకిస్థాన్ కూడా ఒక గోల్డ్ మెడల్ సాధించి భారత్ కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. పతకాల ఖాతా తెరిచిన 84 దేశాల్లో భారత్ 71వ స్థానంలో నిలిచింది. ఏళ్లు గడుస్తున్నా.. వందల కోట్లు ఖర్చు చేస్తున్నా.. భారత్ పతకాల సంఖ్య పెరగడం లేదు. ఒలింపిక్స్లో భారత్ వైఫల్యానికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

దేశంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడుతోందనే చర్చ జరుగుతోంది. ఒలింపిక్స్ వైఫల్యం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి. క్రికెట్కే అధిక ప్రాధాన్యత ఇవ్వడం.. ఒలింపిక్స్లో ఉన్న క్రీడల గురించి పెద్దగా తెలియకపోవడం కూడా భారత వైఫల్యానికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ అందించే అథ్లెటిక్స్ను పెద్దగా పట్టించుకోకపోవడం, క్రికెటర్లకు ఉన్న క్రేజీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ అథ్లెట్లకు లేకపోవడం భారత్ వైఫల్యానికి దారితీస్తోంది. అమెరికా, జపాన్ దేశాలు భారత్ కంటే చిన్నవి.. కానీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో మాత్రం దూసుకెళుతున్నాయి.
క్రికెట్ మ్యాచ్ల కోసం ఇతర దేశాలకు వెళ్లే రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీలు.. ట్రాక్ అండ్ ఫీల్డ్, ఇతర క్రీడల ఈవెంట్స్ హాజరు కావడం లేదు. ఐపీఎల్ తరహాలోనే ప్రతీ ఏడాది భారత్లో ఒలింపిక్స్ తరహాలో నేషనల్ గేమ్స్ నిర్వహించాలని, ఆ టోర్నీకి ముందు రాష్ట్రాలు, జిల్లాలు, మండల స్థాయిలో టోర్నీ నిర్వహించి ప్రతిభ కలిగిన అథ్లెట్లను పైకి తీసుకురావాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారని, కానీ వారికి కావాల్సిన ప్రోత్సాహం అందడం లేదని, పైగా క్రీడల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువ అవ్వడం కూడా ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడల కోసం కేటాయించే బడ్జెట్.. అమలు చేయడం లేదని, అమలు చేసినా వాటిలో కూడా చాలా అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోసం రూ. 470 కోట్లు ఖర్చు చేశామని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతుంటే.. తమకు అంత డబ్బు ఖర్చు పెట్టలేదని అశ్విన్ పొన్నప్ప వంటి క్రీడాకారులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.