ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఒకప్పుడు భారత్ను పాము కాట్లు, ఏనుగుల దేశంగా మాత్రమే భావించేవాళ్లని గుర్తు చేశాడు. ప్రస్తుతం భారత్ అతిపెద్ద ప్రజాస్వామ దేశంగా.. గ్లోబల్ టెక్ హబ్గా పేరుగాంచిందని, అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, ఒక్క ఒలింపిక్స్లో మాత్రమే వెనుకబడి ఉందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024 నేపథ్యంలో భారత అథ్లెట్లను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ ఓ వీడియోను షేర్ చేశాడు. పతకాల సంఖ్యను డబుల్ చేయాలని వారికి సూచించాడు.

'ఒకప్పుడు భారత్ను పాము కాట్లు, ఏనుగుల దేశంగా మాత్రమే భావించేవాళ్లు. కాలక్రమేణా ఇది మారిపోయింది. ప్రస్తుతం భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, గ్లోబల్ టెక్ హబ్గా నిలిచింది. క్రికెట్, బాలీవుడ్, స్టార్టప్ యునికార్న్స్తో పాటు వివిధ రంగాల్లో దూసుకుపోతున్నాం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా గుర్తింపు పొందాం.
భారత్ ఏదైనా సాధించాల్సి ఉందంటే.. అది ఒలింపిక్స్లో మరిన్ని పతకాలే. ఈసారి గతంలో కంటే ఎక్కువ పతకాలు భారత అథ్లెట్లు సాధించాలి. నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మెడల్స్ కోసం ఆకలితో పారిస్కు వెళ్తున్నారు. భారత అథ్లెట్లు మైదానంలో అడుగుపెట్టినప్పుడు వారి విజయం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
దేశంలోని ప్రతీ మూలన ఇండియా, ఇండియా ఇండియా అనే నినాదాలు మార్మోగుతాయి. ధృడ సంకల్పంతో విజయానికి అంగుళం దూరంలో ఉన్న వారి ముఖాలను నాతో కలిసి గుర్తుకుతెచ్చుకోండి. జైహింద్, గుడ్ లక్ ఇండియా'అని విరాట్ కోహ్లీ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
పారిస్ ఒలింపిక్స్కు రంగం సిద్దమైంది. మరో 10 రోజుల్లో ఈ క్రీడల మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్ల్లో అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
భారత్ నుంచి మొత్తం 111 మంది అథ్లెట్లు మొత్తం 16 క్రీడల్లో పోటీ పడనున్నారు. గత టోక్యో ఒలింపిక్స్లో 124 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగగా.. ఈ సంఖ్య ఈసారి 111కు పడిపోయింది. క్రీడల సంఖ్య కూడా 18 నుంచి 16కు తగ్గింది. టోక్యో ఒలింపిక్స్లో ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో అర్హత సాధించిన భారత ప్లేయర్లు.. ఈ సారి క్వాలిఫై కాలేకపోయారు.