కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్) తీర్పు తర్వాత భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తొలి పోస్ట్ను షేర్ చేశారు. తాను ఏడుస్తున్న ఫొటోకు ఎమోషనల్ సాంగ్ను జత చేశారు. ఈ తీర్పుతో తాను ఎంతో బాధపడుతున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. పతకం రాకున్నా.. తమ దృష్టిలో గోల్డ్ మెడల్ సాధించిన రెజ్లర్వేనని కామెంట్ చేస్తున్నారు. భారత రెజ్లింగ్ ఛాంపియన్గా చరిత్రకెక్కావని, ఈ దేశం ఎప్పటికీ నీ పోరాటాన్ని, ఆటను మరవదని ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరిన తొలి మహిళా భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్.. చివరకు అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. పరిమితి కంటే 100 గ్రాములు అధిక బరువు ఉండటంతో ఆమెపై వేటు తప్పలేదు. దాంతో ఆమెకు ఏ పతకం రాలేదు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(కాస్)ను ఆశ్రయించినా నిరాశే ఎదురైంది.

రజత పతకం ఇవ్వాలని ఆమె చేసిన అప్పీల్ను కాస్ కొట్టేసింది. వినేష్ ఫోగట్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు అడహక్ డివిజన్ సోల్ ఆర్బిట్రేటర్ అనబెల్ బెనెట్ బుధవారం తీర్పునిచ్చారు. ఇప్పటికే ఈ తీర్పుపై భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అసంతృప్తిని వ్యక్తం చేసింది. వినేశ్కు మద్దతుగా ఉంటామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష భరోసా ఇచ్చారు.
వినేష్ ఫోగట్ అప్పిల్ను తిరస్కరించడానికి గల కారణాన్ని కాస్ తెలపలేదని వినేశ్ తరఫున వాదించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన విదుష్పత్ సింఘానియా అన్నారు. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఆర్డర్ ఇంకా రాలేదని, సింగిల్ ఆర్డర్ మాత్రమే వచ్చిందని తెలిపారు. కాస్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 30 రోజుల్లోపు స్విస్ ఫెడరల్ ట్రైబున్యల్లో అప్పీల్ చేయవచ్చని ఆయన వివరించారు.