పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్ చేరింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వినేష్ ఫోగట్ అద్వితీయమైన ప్రదర్శనతో ప్రత్యర్థులను మట్టికరిపించింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ కేటగిరీలో పోటీపడుతున్న వినేష్ ఫోగట్.. వరల్డ్ నెంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జపాన్ ప్లేయర్ యుయ్ సుసాకితో పాటు ఉక్రెయిన్ ప్లేయర్ ఒక్సానా లివాచ్ను మట్టి కరిపించింది.
10 సెకన్లలో మారిన ఫలితం..
తొలి మ్యాచ్ చివరి 10 సెకన్లలో వినేష్ ఫోగట్ అద్వితీయమైన ప్రదర్శనతో సంచలన విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో అనవసర తప్పిదాలతో పెనాల్టీగా ప్రత్యర్థికి రెండు పాయింట్స్ కోల్పోయిన వినేష్ ఫోగట్.. జపాన్ ప్లేయర్ అటాకింగ్ గేమ్తో డిఫెన్స్కే పరిమితమైంది. మరో 10 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా.. వినేష్ ఫొగట్ అద్భుతంగా ప్రత్యర్థిని పడగొట్టి 2 పాయింట్స్ సాధించింది.

అయితే ఈ నిర్ణయాన్ని జపాన్ ప్లేయర్ సవాల్ చేయగా.. ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో వినేష్ ఫోగట్కు ఓ పాయింట్ కలిసొచ్చి 3-2తో విజయం సాధించింది. రెజ్లింగ్లో రిఫరీల నిర్ణయాన్ని సవాల్ చేసినప్పుడు ప్రతికూల ఫలితం వస్తే ప్రత్యర్థికి ఓ పాయింట్ కేటాయిస్తారు. స్కోర్లు సమమైతే.. బిగ్ పాయింట్స్ ఎవరు సాధించారో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఈ లెక్కన చూసుకున్న ఫోగట్ విజయం విజయం సాధించేది. ఎందుకంటే సుసాకికి వచ్చిన రెండు పాయింట్స్ పెనాల్టీగా లభించనవే.
క్వార్టర్స్లో దూకుడు..
క్వార్టర్ ఫైనల్లో వినేష్ ఫోగట్ 7-5తో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ను ఓడించింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు కనబర్చిన వినేష్ ఫొగట్ వరుసగా పాయింట్స్ సాధించి 4-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. అనంతరం లివాచా రెండు పాయింట్స్ సాధించగా.. వినేష్ ఫోగట్ సవాల్ చేసింది. దాంతో మరో పాయింట్ కోల్పోయింది. ఫస్టాఫ్ ముగిసేసరికి 4-3తో వినేష్ ఫోగట్ ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్లో ఉక్రెయిన్ ప్లేయర్ దూకుడు కనబర్చగా.. వినేష్ ఫొగట్ డిఫెన్స్కు పరిమితమైంది. చివర్లో మరో 3 పాయింట్స్ సాధించగా.. ఉక్రెయిన్ ప్లేయర్ రెండు పాయింట్స్ మాత్రమే సాధించింది. దాంతో వినేష్ ఫొగట్ విజయం ఖాయమైంది.
అంచనాలు లేకుండా..
వినేష్ ఫొగట్ గతేడాది మొత్తం రోడ్లపైనే గడిపింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ చరణ్ సింగ్కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. చాలా రోజుల పాటు ఈ నిరసనలు జరగ్గా.. వినేష్ ఫోగట్ చురుకుగా పాల్గొంది.
అంతేకాకుండా ఆమె రెగ్యూలర్గా ఆడే 53 కేజీల కేటగిరిలో అంతిమ్ పంఘల్ ఒలింపిక్స్ అర్హత సాధించడంతో.. వినేష్ ఫోగట్ 50 కేజీల విభాగానికి మారింది. దాంతో ఆమె గెలవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ వినేష్ ఫొగట్ సంచలన ప్రదర్శనతో సెమీస్ చేరింది. ఈ రోజు రాత్రి 10.13 గంటలకు జరిగే సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే వినేష్ ఫోగట్కు పతకం ఖాయమవుతోంది. ఓడితే బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది.