యావత్ భారత్.. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS) ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తోంది. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్కు అనుకూలమైన తీర్పు రావాలని, ఆమెకు రజత పతకం దక్కాలని ప్రార్థిస్తోంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరింది.
వరల్డ్ నెంబర్ వన్ ఓడించి..
తొలి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకి(జపాన్)ని మట్టికరిపించింది. రెండో రౌండ్లో ఉక్రెయిన్ ప్లేయర్ ఒక్సానా లివాచ్ను ఓడించింది. సెమీఫైనల్లో క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్ ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్తో వినేష్ ఫోగట్ తలపడాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఆమె 100 గ్రాముల అధిక బరువుతో అనర్హత వేటుకు గురైంది.

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యుడబ్ల్యూడబ్ల్యూ) రూల్స్ ప్రకారం.. డిస్క్వాలిఫై అయిన రెజ్లర్కు ఫైనల్ చేరినా చివరి ర్యాంక్ ఇస్తారు. దాంతో ఆమె చేతిలోసెమీఫైనల్లో ఓడిన క్యుబా రెజ్లర్ యుస్నీలీస్ గుజ్మాన్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఫైనల్లో అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్ చేతిలో ఓడి రజత పతకం సొంతం చేసుకుంది.
రెపిచేజ్ మ్యాచ్ ఎలా ఆడిస్తారు..?
వినేష్ ఫోగట్ చేతిలో ఓడిన ఒక్సానా లివాచ్, యుయ్ సుసాకి రెపిచేజ్ మ్యాచ్ ఆడారు. ఇందులో గెలిచిన యుయ్ సుసాకి కాంస్య పతకం సాధించింది. యూడబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం ఫైనల్ చేరిన ఆటగాళ్ల చేతిలో ఓడిన రెజ్లర్లు మాత్రమే రేపిచేజ్ ఆడాలి. ఇక్కడ వినేష్ ఫోగట్ డిస్ క్వాలిఫై అయ్యి చివరి ర్యాంక్కు పడిపోయినప్పుడు.. ఆమె చేతిలో ఓడినవారిని రేపిచేజ్ మ్యాచ్ ఎలా? ఆడిస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
రెజ్లింగ్ సమాఖ్య రూల్స్లోనే ఇద్ద పెద్ద లూప్ హోల్ ఉన్నప్పుడు.. 100 గ్రాముల అధిక బరువుతో డిస్ క్వాలిఫై అయిన వినేష్ ఫోగట్కు రజత పతకం ఎందుకు ఇవ్వవద్దు? అనే ప్రశ్న వస్తోంది. వాస్తవానికి తన తొలి మ్యాచ్కు ముందు వినేష్ ఫోగట్ 49 కేజీల బరువు మాత్రమే ఉంది. రూల్స్ ప్రకారం ఆమె పోటీలకు అర్హత సాధించింది. కానీ ఒకే రోజు మూడు మ్యాచ్లు ఆడాల్సి రావడంతో ఎనర్జీ కోసం ఆమె ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి వచ్చింది.
ఒకే రోజు మూడు మ్యాచ్లు..
దాంతో ఆమె రెండు కిలోల బరువు పెరగాల్సి వచ్చింది. వినేష్ ఫోగట్ మినహా మరే రెజ్లర్ అతి తక్కువ టైమ్ గ్యాప్లో మూడు మ్యాచ్లు ఆడలేదు. అందుకే వారు బరువును కంట్రోల్లో ఉంచుకున్నారు. వినేష్ కూడా బరువు తగ్గేందుకు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. చివరకు 100 గ్రాముల అదనపు బరువుతో ఆమె డిస్ క్వాలిఫై అయ్యింది.
తనకు జరిగిన అన్యాయంపై వినేష్ ఫోగట్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్(CAS)ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు పూర్తవ్వగా తీర్పు మరికొద్ది గంటల్లో రానుంది. అయితే వినేష్ ఫోగట్ అప్పీల్కు వ్యతిరేకంగా యూడబ్ల్యూడబ్ల్యూ గట్టిగా వాదిస్తోంది. రూల్స్ ఒక్కరి కోసం మార్చలేమని చెబుతోంది. ఇప్పటికే వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్ విలేజ్ను వదిలి బయటకు వచ్చింది. CAS తీర్పు ఆమెకు వ్యతిరేకంగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.