పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్, తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 16వ సీడ్ ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడెన్కు చెందిన క్రిస్టీనాను చిత్తు చేసింది. 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో శ్రీజ పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
వరుసగా నాలుగు గేముల్లో విజయం సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఏ గేమ్లోనూ ప్రత్యర్థికి హైదరాబాద్ స్టార్ అవకాశం ఇవ్వలేదు. మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో ఇండియా టాప్ ర్యాంకర్ అయిన శ్రీజ అందుకు తగ్గట్లే ఆడి విజయం సాధించింది. కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్ అర్హత సాధించిన శ్రీజ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

శ్రీజ వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లో పాల్గొంటుంది. అచంట శరత్, శరత్ కమల్, సతియన్, మానిక బత్రా, ఆకుల శ్రీజతో కూడిన భారత టేబుల్ టెన్నిస్ టీమ్.. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇతర ఈవెంట్లలో పీవీ సింధు శుభారంభం చేయగా.. రోయర్ బాల్రాజ్ పన్వార్ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాడు. మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్ రమిత ఫైనల్కు చేరింది.
సింధు శుభారంభం..
ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు తేజం పీవీ సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్ను చిత్తు చేసింది. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన సింధుకు రజాక్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
దాంతో సింధు వరుస గేమ్ల్లో విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సింధు స్మాష్లకు మాల్దీవల ప్లేయర్ తేలిపోయింది. బుధవారం జరగనున్న రెండో రౌండ్లో పీవీ సింధు ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో తలపడుతోంది.
మెడల్ ఈవెంట్కు రమిత..
రోయింగ్ ఈవెంట్లో భారత అథ్లెట్ బాల్రాజ్ పన్వార్ సత్తా చాటాడు. ఆదివారం జరిగిన రిపేఛేజ్ విభాగం రెండో రౌండ్లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాడు. మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నేల్లి తొలి స్థానం సాధించగా.. రెండో స్థానంలో నిలిచి బాల్రాజ్ క్వార్టర్స్కు దూసుకెళ్లాడు.
మహిళల 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో భారత అథ్లెట్ రమిత ఫైనల్కు చేరింది. 631.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ఫైన్లకు అర్హత సాధించింది.