పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బ్యాడ్మింటన్ స్టార్ హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-18, 21-12తో జర్మనీ ఆటగాడు ఫాబియన్ రోట్ను ఓడించాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ప్రణయ్కు తెలుగులో పలు సూచనలు చేశాడు.
'పైకి వచ్చిందనుకో కిందకు కొట్టు. ఈ రేంజ్లో వచ్చిందనుకో'అంటూ తెలుగులో సలహా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పారిస్లో తెలుగు మచ్చట్లు అంటూ తెలుగు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్లో తెలుగు వినడం సంతోషంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇదే జోరులో ప్రణయ్ స్వర్ణ పతకం గెలవాలని, సరికొత్త చరిత్రను లిఖించాలని తెలుగు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

సింధు శుభారంభం..
మహిళల సింగిల్స్లో పీవీ సింధు కూడా శుభారంభం చేసింది. హ్యాట్రిక్ మెడల్స్పై గురిపెట్టిన సింధు తన క్యాంపైన్ను ఘనంగా ప్రారంభించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్ తొలి మ్యాచ్లో తెలుగు తేజం పీవీ సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవులకు చెందిన అబ్దుల్ రజాక్ను చిత్తు చేసింది.
మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన సింధుకు రజాక్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దాంతో సింధు వరుస గేమ్ల్లో విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సింధు స్మాష్లకు మాల్దీవుల ప్లేయర్ తేలిపోయింది. బుధవారం జరగనున్న రెండో రౌండ్లో పీవీ సింధు ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాతో తలపడుతోంది.
చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ..
బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ క్వార్టర్స్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. జర్మనీ జోడీ మర్క్-మెర్విన్తో సోమవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. మార్క్కు మోకాలి గాయం కావడంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో నిర్వాహకులు మ్యాచ్ను రద్దు చేసారు.
గ్రూప్ సీలో ఆర్టియాంటో-ఆల్పియన్(ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ క్వార్డర్ ఫైనల్స్కు అర్హత సాధించారు. దాంతో ఒలింపిక్స్లో క్వార్టర్స్ చేరిన తొలి భారత డబుల్స్ జోడీగా సాత్విక్ చిరాగ్ చరిత్ర సృష్టించారు. సోమవారం పురుషుల సింగిల్స్లో జరిగిన మ్యాచ్లో లక్ష్యసేన్ 21-19, 21-14 తేడాతో జులియన్(బెల్జియం)పై విజయం సాధించాడు.