భారత మహిళా షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఒక ఎడిషన్ ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత అథ్లెట్గా రికార్డ్ సాధించింది. 124 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో మరే భారత అథ్లెట్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించి భారత మెడల్స్ ఖాతా తెరిచిన మను భాకర్.. 48 గంటల వ్యవధిలోనే మరో పతకాన్ని ముద్దాడింది.
10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి మరో కాంస్యాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో మను భాకర్-సరబ్ జోత్ సింగ్ ద్వయం 16-10తో సౌత్ కొరియాకు చెందిన జుయీ లీ-వోన్షోలీపై విజయం సాధించింది.

ఈ చారిత్రాత్మక విజయంతో భారత్ తరఫున రెండు మెడల్స్ గెలిచిన పీవీ సింధు, సుశీల్ కుమార్ సరసన మను భాకర్ నిలిచింది. భారత్కు రెండు పతకాలు అందించిన మను భాకర్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి మను భాకర్ను అభినందించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓఏ) సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మను భాకర్తో హిందీలో మాట్లాడిన నరేంద్ర మోదీ.. ఆమె విజయాన్ని అభినందించారు. దేశం మొత్తం గర్వపడుతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది.
అంతకుముందు రెండో మెడల్ గెలవడంపై సంతోషం వ్యక్తం చేసిన మను భాకర్.. మరో మెడల్ గెలవకపోతే తిట్టుకోవద్దని చమత్కరించింది. ఈ విజయంతో తాను గర్వపడుతున్నానని, తనపై ప్రేమను చూపించిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పింది. పారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ మరో ఈవెంట్లో పోటీ పడనుంది. మహిళల 25మీటర్ల పిస్టల్ ఈవెంట్ బరిలోకి దిగనుంది.