పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ హర్షద్ నదీమ్ చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో స్వర్ణ పతకం సాధించి పాకిస్థాన్ 32 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 1992లో చివరిసారిగా మెడల్ సాధించిన పాకిస్థాన్ .. ఆ తర్వాత ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా గెలవలేదు. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్లో హర్షద్ నదీమ్ ఆల్టైమ్ ఒలింపిక్ రికార్డ్ను బద్దలు కొట్టాడు.
ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన అతను.. రెండో ప్రయత్నంలో మాత్రం ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో నార్వే జావెలిన్ త్రోయర్ ఆండ్రీస్ తొర్కిల్డ్సెన్ నమోదు చేసిన 90.57 మీటర్ల ఒలింపిక్ రికార్డ్ను హర్షద్ నదీమ్ అధిగమించాడు.

క్వాలిఫికేషన్లో 89 మీటర్లు కూడా విసరని నదీమ్.. ఫైనల్లో మాత్రం రెండు సార్లు ఈటెను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరడం విశేషం. పారిస్ ఒలింపిక్స్లో పాకిస్థాన్ గెలిచిన ఏకైక పతకం ఇదే కావడం గమనార్హం. ఫైనల్లో అనూహ్యంగా ఈటెను 92.97 మీటర్లు విసిరిన నదీమ్కు ఇదే వ్యక్తిగత రికార్డ్ కావడం విశేషం.
డిఫెండింగ్ ఛాంపియన్, భారత జావెలియన్ త్రోయర్ నీరజ్ చోప్రా 89.45 మీటర్లతో రజతం సొంతం చేసుకోగా.. గ్రెనెడా ప్లేయర్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం అందుకున్నాడు. హర్షద్ నదీమ్ స్వర్ణంతో పతకాల పట్టికలో భారత్ కంటే పాకిస్థాన్ 10 స్థానాలు ముందంజలో నిలిచింది. భారత్ ఇప్పటి వరకు ఐదు పతకాలు గెలిచినా.. ఒక్క స్వర్ణం కూడా గెలవలేదు. నాలుగు కాంస్యాలతో పాటు ఓ రజతం మాత్రమే గెలిచి 63వ స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ ఒక్క పతకం గెలిచినా అది స్వర్ణం కావడంతో 53వ స్థానంలో నిలిచింది.