అభిమానుల కోలాహలం, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒలింపిక్ జ్యోతి ఆతిథ్య దేశం అయిన ఫ్రాన్స్కు చేరుకుంది. 1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడలో మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణించి ఫ్రాన్స్లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది.
బెలెమ్గా పేరు గాంచిన ఈ ప్రసిద్ధి ఓడ ఏథెన్స్ నుంచి ఒలింపిక్ జ్యోతితో ప్రయాణాన్ని ప్రారంభించి సౌత్ ఫ్రెంచ్ నగరమైన మార్సెకు బుధవారం చేరుకుంది.

ఒలింపిక్ జ్యోతి రాకతో ఆతిథ్య దేశమైన ఫ్రాన్స్లో సంబరాలు మిన్నంటాయి. వేలాది పడవల పరేడ్ మధ్య బెలెమ్.. మార్సె తీరాన్ని చేరుకుంది. ఈ పురాతన ఓడరేవులో అథ్లెటిక్ ట్రాక్లా రూపొందించిన వేదిక దగ్గర ఈ ఒలింపిక్ ఓడ ఆగింది. ఒలింపిక్ టార్చ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో ఓడరేవు పరిసిర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
మార్సెలో గురువారం ఈ జ్యోతి యాత్ర ప్రారంభమై ఫ్రాన్స్ మొత్తం ప్రయాణించి పోటీలకు వేదికైన పారిస్కు చేరుకుంటుంది. ఫ్రాన్స్లో ఒలింపిక్ టార్చ్ను ముందుగా స్విమ్మర్ ఫ్లోరెంట్ మనాడో పట్టుకోనున్నాడు. అతను నాలుగు ఒలింపిక్ మెడల్స్ గెలిచాడు. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు పారిస్ వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి.

పారిస్ ఒలింపిక్స్ ఈసారి అభిమానులు అలరించనున్నాయి. ఈ సారి బ్రేక్ డ్యాన్స్ క్రీడను కూడా ఒలింపిక్స్లో చేర్చారు. డీజే మ్యూజిక్ వినిపిస్తుంటే చిత్రమైన డ్యాన్స్ చేస్తారు. చేతులు కింద పెట్టి కాళ్లు పైకి లేపి సంగీతానికి తగ్గట్లు ఒంటిని రకరకాలుగా వంచడం.. మధ్యలో నిశ్చలంగా ఉండటం వంటి విన్యాసాలు చేస్తారు.