భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై వెనుక భారీ కుట్ర జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మహిళల 50 కేజీల ప్రీస్టైల్ విభాగంలో పోటీపడిన వినేష్ ఫోగట్ సంచలన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లింది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలోనే ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్గా చరిత్రసృష్టించింది.
మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యుయు సుసాకీ(జపాన్)ని వినేష్ ఫోగట్ మట్టికరిపించింది. చివరి 10 సెకన్లలోనే మూడు పాయింట్స్ సాధించి 3-2తో విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో ఆమె ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అదే జోరులో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ను క్వార్టర్ ఫైనల్లో ఓడించింది.

పాపం వినేష్ ఫోగట్..
మంగళవారమే జరిగిన ఫైనల్లో క్యూబా ప్లేయర్ యుస్నీ లీస్ గుజ్మాన్ను 5-0తో చిత్తు చేసి ఫైనల్ చేరింది. బుధవారం మధ్యాహ్నం 12.45కు వినేష్ ఫోగట్ అమెరికాకు చెందిన సారా హిండెబ్రాండ్తో ఫైనల్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆమె తన కేటగిరి కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో పతకం లేకుండానే వెనుదిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాస్తవానికి వినేష్ ఫోగట్ 53 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. రియో ఒలింపిక్స్ 2016తో పాటు టోక్యో ఒలింపిక్స్ 2020లోనే ఇదే కేటగిరిలో బరిలోకి దిగింది. దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ సారి డబ్ల్యూఎఫ్ఐలో నెలకొన్న రాజకీయాలతో ఆమె తన కేటగిరిని మార్చుకోవాల్సి వచ్చింది.

కొంపముంచిన ఫ్లూయిడ్స్..?
ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్లో యువ ప్లేయర్ అంతిమ్ పంఘల్ చేతిలో వినేష్ ఫోగట్ ఓటమిపాలైంది. దాంతో ఆమె 53 కేజీల నుంచి 50 కేజీల మారాల్సి వచ్చింది. మంగళవారం మూడు మ్యాచ్లకు ముందు ఆమె 50 కేజీల బరువే ఉంది. కానీ ఈ మ్యాచ్ల సందర్భంగా ఎనర్జీ కోసం తీసుకున్న ఫ్లూయిడ్స్, ఎలక్టరోలైట్స్ డ్రింక్స్ కారణంగా ఆమె 2 కిలోల బరువు పెరిగినట్లు తెలుస్తోంది.
24 గంటల వ్యవధిలోనే ఫైనల్ ఉండటంతో రాత్రంతా 2 కిలోల బరువు తగ్గేందుకు వినేష్ ఫోగట్ తీవ్రంగా ప్రయత్నించింది. నిద్రహారాలు మాని స్కిప్పింగ్, జాగింగ్ చేసినా ఆమె నిర్దిష్ట బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో డిస్క్వాలిఫై అయ్యింది.
భారీ కుట్ర..?
కొంత సమయం కావాలని భారత ఒలింపిక్ కమిటీ చేసిన విజ్ఞప్తిని కూడా పారిస్ ఒలింపిక్ కమిటీ పట్టించుకోలేదు. అయితే వినేష్ ఫోగట్ బరువు పెరగడం వెనుక భారీ కుట్ర జరిగిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. డబ్ల్యూఎఫ్పై మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనల్లో వినేష్ ఫోగట్ చురుకుగా పాల్గొంది.
ఈ క్రమంలో ఆమె బీజేపీ ప్రభుత్వంపై యుద్దమే ప్రకటించింది. పోలీసుల చేతుల దెబ్బలు కూడా తిన్నది. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్తో పాటు ఎన్నో అవమానాలను భరించింది. ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్ ఫైనల్ చేరడంతో ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.

వెన్నుపోటు..?
అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వినేష్ ఫోగట్ విజయాన్ని అభినందించలేదు. ఆమె డిస్క్వాలిఫై అయిన తర్వాత సానుభూతి వ్యక్తం చేశారు. ఇతర అథ్లెట్లు పతకం గెలిచినప్పుడు వారితో మాట్లాడిన మోదీ.. వినేష్ ఫోగట్ విజయాన్ని పట్టించుకోలేదని ఆమె మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. ఆమె డిస్ క్వాలిఫై కావాలనే ఉద్దేశంతోనే అధిక బరువు పెరిగే ఆహారం అందించారని ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా భారత ఒలింపిక్ కమిటీ తీరును కూడా తప్పుబడుతున్నారు. భారత అథ్లెట్కు అండగా నిలవకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. అధిక బరువు పెరిగిందని గ్రహించినప్పుడు.. ఫైనల్లో పాల్గొనకుండా తప్పుకుంటే కనీసం రజత పతకం అయినా వచ్చేది కదా? అని నిలదీస్తున్నారు. ఆమె సపోర్ట్ స్టాఫ్లోని వ్యక్తే వినేష్ ఫోగట్కు వెన్నుపోటు పోడిచారాని అభిప్రాయపడుతున్నారు.