భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫికేషన్ వ్యవహారం ప్రతీ ఒక్కరిని బాధిస్తోంది. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు వేయడం దారుణమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్ కమిటీ నిర్ణయంపై మండిపడుతున్నారు.
మహిళల 50 కేజీల ప్రీస్టైల్ విభాగంలో పోటీపడిన వినేష్ ఫోగట్ సంచలన ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లి భారత్కు పతకం ఖాయం చేసిన విషయం తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలోనే ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్గా వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది.

బుధవారం మధ్యాహ్నం 12.45కు వినేష్ ఫోగట్ అమెరికాకు చెందిన సారా హిండెబ్రాండ్తో ఫైనల్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆమె తన కేటగిరి కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో పతకం లేకుండానే వెనుదిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం డిస్క్వాలిఫై అయిన ప్లేయర్కు ఏ పతకం ఇవ్వరు. దాంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో బ్రాంజ్, గోల్డ్ మెడల్ మాత్రమే ఇవ్వనున్నారు.
వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫికేషన్ వ్యవహారంలో ఆమె సపోర్ట్ స్టాఫ్ అలసత్వం కూడా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. మంగళవారం ఆమె ఆడిన మూడు మ్యాచ్లకు నిర్ణీత బరువు ఉన్న వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఎనర్జీ కోసం ఆమెకు అందించిన ఫ్ల్యూయిడ్స్ ఆమె బరువును పెంచాయా? లేక కుట్రపూరితంగా డిస్క్వాలిఫై అయ్యేలా చేశారా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
అధిక బరువు ఉందని గ్రహించిన వినేష్ ఫోగట్ రాత్రంతా బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె 100 గ్రాములు ఎక్కువగానే ఉంది. ఈ విషయం తెలిసినప్పుడు ఫైనల్ నుంచి తప్పుకుంటే కనీసం సిల్వర్ మెడల్ లభించేది కదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. డీహైడ్రెషన్కు గురైన వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ విలేజ్లోని ఆసుపత్రిలో కూడా చేరింది.
ఇదే విషయాన్ని సాకుగా చూపించి ఫైనల్ నుంచి తప్పుకుంటే సిల్వర్ మెడల్ వచ్చేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సపోర్ట్ స్టాఫ్ అలసత్వం వినేష్ ఫోగట్ కొంపముంచిందని మండిపడుతున్నారు. ఇందులో కుట్ర కోణం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. సమగ్ర విచరాణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం గాయపడిన ఆటగాళ్లు కూడా బరువును పరీక్షించుకోవాలి. ఈ రూల్స్ కారణంగానే ఒలింపిక్స్ అధికారులు ఏం చేయలేకపోయారు.