పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత జావెలిన్ త్రోయర్, డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టాడు. దేశానికి మరో గోల్డ్ మెడల్ అందిస్తాడనే భారీ అంచనాలతో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తీవ్రంగా నిరాశపర్చాడు. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్లో నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.
తద్వారా ఒలింపిక్స్ చరిత్రలోనే వరుసగా రెండు మెడల్స్ సాధించిన తొలి భారత జావెలిన్ త్రోయర్గా చరిత్రకెక్కాడు. తాజా ఒలింపిక్స్లో భారత్కు ఇదే తొలి సిల్వర్ మెడల్ కావడం విశేషం. క్వాలిఫికేషన్ రౌండ్లో ఈటెను అందరి కన్నా ఎక్కువ దూరం విసిరి గోల్డ్ మెడల్ అంచనాలు పెంచిన నీరజ్ చోప్రా.. ఫైనల్లో మెరుగైన ప్రదర్శనే చేశాడు.

తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో మాత్రం సీజన్ బెస్ట్ 89.45 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో నీరజ్ చోప్రా విఫలమయ్యాడు. మూడు, నాలుగు ప్రయత్నాల్లో ఈటెను తక్కువ దూరం విసరడంతో ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ చేశాడు. కానీ ఐదో ప్రయత్నంలో మాత్రం సమన్వయం కోల్పోయి లైన్ తొక్కేసాడు. చివరి ప్రయత్నంలోనూ ఫౌల్ చేశాడు.
మరోవైపు పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ హర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం విసిరి ఆల్టైమ్ ఒలింపిక్ రికార్డ్ నమోదు చేయడంతో పాటు గోల్డ్ మెడల్ అందుకున్నాడు. క్వాలిఫికేషన్లో 89 మీటర్లు కూడా విసరని నదీమ్.. ఫైనల్లో మాత్రం రెండు సార్లు ఈటెను 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరడం విశేషం. ఒలింపిక్స్లో పాకిస్థాన్ గెలిచిన ఏకైక పతకం ఇదే కావడం గమనార్హం.
తొలి ప్రయత్నంలో విఫలమైన అతను.. రెండో ప్రయత్నంలో మాత్రం ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో నార్వే జావెలిన్ త్రోయర్ ఆండ్రీస్ తొర్కిల్డ్సెన్ 90.57 మీటర్లు ఒలింపిక్ రికార్డ్ను హర్షద్ నదీమ్ బ్రేక్ చేశాడు.
పాకిస్థాన్కు గోల్డ్ మెడల్ అందించిన తొలి జావెలిన్ త్రోయర్గా కూడా హర్షద్ నదీమ్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా పాకిస్థాన్ 32 ఏళ్ల సుదీర్ఘ మెడల్ నిరీక్షణకు తెరదించాడు. 1992లో పాక్ చివరిసారిగా మెడల్ గెలిచింది. గ్రెనెడా ప్లేయర్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం అందుకున్నాడు.