పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు సాధించిన భారత షూటర్ మను భాకర్ మరో మెడల్ను తృటిలో చేజార్చుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పోటీ పడిన మను భాకర్.. శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచింది. దాంతో పతకాన్ని అందుకోలేకపోయింది. ఇప్పటికే మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది.
అనంతరం మరో షూటర్ సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్డ్ డబుల్స్లోనూ మూడో స్థానంలో నిలిచి మరో బ్రాంజ్ మెడల్ గెలిచింది. దాంతో ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్గా చరిత్రకెక్కింది.

మూడో పతకం చేజారిన అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడిన మను భాకర్.. తన తల్లి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగానని భావోద్వేగానికి గురైంది
'నా కోసం అన్నింటిని త్యాగం చేసిన మా అమ్మకు స్పెషల్ థ్యాంక్స్. అమ్మా.. నీ సహకారంతో ఎన్నో చీకట్లను చీల్చుకుంటూ బయటకు రాగలిగాను. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు ఆర్యోగవంతమైన జీవితాన్ని గడుపుతూ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. వీలైనన్ని సంవత్సరాలు నాతో ఉండాలి.'అని మను భాకర్ భావోద్వేగానికి గురైంది.
మూడో మెడల్ చేజారడం తీవ్ర నిరాశకు గురిచేసిందని మను భాకర్ తెలిపింది. 'ఈ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచి మెడల్ చేజార్చుకున్నందుకు నిరాశగా ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నం సరిపోలేదు. మొత్తం మీద ఈ ఒలింపిక్స్లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చా. వచ్చే ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నా.
రెండు పతకాలు సాధించినందుకు ఆనందంగా ఉంది. నేను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నాను. నా ఫోన్ను చెక్ చేయలేదు. బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ నేను మంచి ప్రదర్శన చేశాననే అనిపిస్తోంది. ఈ ఒలింపిక్స్లో నేను పతకాలు సాధించడం వెనుక, కోచ్లు, ఇతర సిబ్బంది కృషి ఎంతో ఉంది. వారా చాలా కష్టపడ్డారు. టీమ్ మొత్తం మద్దతుగా నిలిచారు. వారందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు'అని మను భాకర్ చెప్పుకొచ్చింది.