పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్ ఫైనల్ చేరింది. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్లో భారత్ 3-2 తేడాతో రొమానియోను ఓడించింది. మనికా బాత్రా, ఆకుల శ్రీజ, కామత్ అర్చనా గిరీష్లతో కూడిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ అసాధారణ ప్రదర్శనతో టోర్నీలో ముందడుగు వేసింది.
ఒలింపిక్స్ చరిత్రలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్గా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో మనికా బాత్రా సంచలన ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది.

డబుల్స్లో విజయం..
ఈ ప్రీక్వార్టర్స్లో డబుల్స్లో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ద్వయం ఆకుల శ్రీజ-కామత్ అర్చనా గిరీష్ 3-0తో రొమానియోకు చెందిన డికోను అదినా-సమరా ఎలిజబెటా జోడీని ఓడించింది. వరుసగా మూడు గేమ్ల్లో 11-9, 12-10, 11-7తో భారత్ ద్వయం విజయం సాధించింది. తొలి గేమ్తో పాటు రెండో గేమ్లో గట్టి పోటీనిచ్చినా రోమానియో ద్వయం.. ఆఖరి గేమ్లో మాత్రం చేతులెత్తేసింది.
సింగిల్స్లో జరిగిన రెండో మ్యాచ్లో మనికా బత్రా 3-0తో రోమానియాకు చెందిన బెర్నాడెట్ను ఓడించింది. 11-5, 11-7, 11-7తో మనికా బాత్రా వరుసగా మూడు గేమ్ల్లో సునాయస విజయాన్నందుకుంది.
శ్రీజ, అర్చనా ఓడినా..
మూడో సింగిల్స్ మ్యాచ్లో మాత్రం భారత్కు షాక్ తగిలింది. ఆకులశ్రీజ 2-3 తేడాతో రోమానియాకు చెందిన సమరా ఎలిజబెటా చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్లో శ్రీజ 11-8తో గెలవగా.. రెండో గేమ్ను 4-11తో ఓడిపోయింది. మూడో గేమ్ను 11-7తో గెలిచిన శ్రీజ.. చివరి రెండు గేమ్స్లో 6-11, 8-11 తేడాతో ఓటమిపాలైంది.
నాలుగో సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన కామత్ అర్చనా గిరీష్ 1-3 తేడాతో బెర్నాడెట్ చేతిలో ఓటమిపాలైంది. 5-11, 11-8, 7-11, 9-11 చేతిలో ఓటమిపాలైంది. డిసైడర్గా మారిన చివరి మ్యాచ్లో మనికా బత్రా 3-0తో డికోను అదినా ఓడించి భారత్ను విజేతగా నిలెబట్టింది. ఈ మ్యాచ్లో మనికా బాత్రా 11-5, 11-9, 11-9 తేడాతో రోమానియా ప్లేయర్ను ఓడించింది. మరో రెండు మ్యాచ్లు గెలిస్తే భారత జట్టుకు రజతం ఖాయం అవుతోంది.