భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) నిషేధం విధించినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. పారిస్ ఒలింపిక్స్ 2024 సందర్భంగా ఆమె చేసిన తప్పిదంతో ఐఓఏ క్రమశిక్షణా చర్యలు తీసుకుందని, మూడేళ్ల పాటు అంతిమ్ పంఘల్పై నిషేధం విధించారని వార్తలు వచ్చాయి.
అయితే అమిత్ పంఘల్పై తాము ఎలాంటి నిషేధం విధించలేదని ఐఓఏ అధికారికంగా ప్రకటించింది. మీడియా ప్రతినిథులు ఐఓఏ అధికారుల ప్రతినిధులతో క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత ఈ తరహా వార్తలను ప్రచురించాలని కోరింది.
అంతిమ్ పంఘల్ అక్రిడిటేషన్తో ఆమె సోదరి నిశా.. ఒలింపిక్ విలేజ్లోకి ప్రవేశించడం వివాదస్పమైన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్లో అంతిమ్ పంఘల్ మహిళల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 53 కేజీల కేటగిరిలో పోటీపడింది. క్వార్టర్స్లో తుర్కియే రెజ్లర్ యెట్గిల్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం ఆమె ఒలింపిక్ విలేజ్ బయట ఉంటున్న తన కోచ్లు భగత్ సింగ్, వికాస్ హోటల్కు వెళ్లింది. తన వస్తువులు కొన్ని ఒలింపిక్ విలేజ్లో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి.. తీసుకురమ్మని కోరింది.

అందుకుగాను తన అక్రిడిటేషన్ కార్డును ఇచ్చింది. నిశా ఒలింపిక్ విలేజ్లోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తుండగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె నుంచి వివరణ తీసుకొని పంపించారు. అంతిమ్ను కూడా పిలిపించి వివరణ కోరారు. ఈ క్రమంలో అంతిమ్ తన అక్రిడిటేషన్ను దుర్వినియోగం చేసినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు దానిని రద్దు చేశారు. ఈ విషయంలో అంతిమ్కు తమ పూర్తి సహకారం అందిస్తున్నామని ఐఓఏ తెలిపింది.