ఒలింపిక్స్లో టెన్నిస్ విభాగంలో భారత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క మెడల్ గెలిచింది. అది కూడా 1996లో లియాండర్ పేస్ గెలిచిన కాంస్యమే టెన్నిస్లో భారత్కు దక్కిన పతకం. ఆ తర్వాత మరో మెడల్ కోసం భారత టెన్నిస్ ప్లేయర్లు పోరాడుతూనే ఉన్నారు. కానీ ప్రతిసారి నిరాశే ఎదురవ్వడంతో టెన్నిస్లో భారత ఆటగాళ్లపై అంచనాలే లేకుండా పోయాయి.
మరో 6 రోజుల్లో ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి సుమిత్ నగాల్, రోహన్ బోపన్న-శ్రీరామ్ బాలాజి బరిలోకి దిగుతున్నా.. పోడియంపై నిలబడాలంటే శక్తికి మించి రాణించాల్సిందే.

బోపన్నకు చివరి ఒలింపిక్స్..
రోహన్ బోపన్నకు ఇదే చివరి ఒలింపిక్స్.. 2012, 2016 ఒలింపిక్స్లో ఆడిన బోపన్న.. 2016లో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో తృటిలో బ్రాంజ్మెడల్ చేజార్చుకున్నాడు. కాంస్య పోరులో ఈ జోడీ ఓటమిపాలైంది. ప్రస్తుతం బోపన్న వయసు 44 ఏళ్లు. ఈ వయసులో అతనిపై అంచనాలు తక్కువే. కానీ ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్తో కలిసి డబుల్స్లో బోపన్న అదరగొడుతున్నాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. డబుల్స్లో నంబర్ వన్ ర్యాంక్ అందుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్లో సెమీస్ వరకూ వెళ్లాడు. ఈ క్రమంలోనే బోపన్న కనీసం కాంస్య పతకమైనా గెలుస్తాడనే అంచనాలు నెలకొన్నాయి.
సుమిత్ నగాల్..
పురుషుల సింగిల్స్లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ గతేడాదిగా నిలకడగా రాణిస్తున్నాడు. కానీ ఒలింపిక్స్ పతకం సాధించే సత్తా ఉందా. అంటే లేదనే చెప్పాలి. అల్కరాజ్, జకోవిచ్, సినర్ వంటి వరల్డ్ క్లాస్ టెన్నిస్ స్టార్లను తట్టుకొని పతకం సాధించడం సుమిత్ నగాల్కు స్థాయికి మించిన పనే. ఒలింపిక్స్లో విజయాలు సాధిస్తే అతను గొప్ప విజయం సాధించినట్లే.
ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ప్రధాన డ్రాకు అర్హత సాధించడమే కాకుండా.. తొలి రౌండ్లో తనకంటే మెరుగైన ఆటగాడిని ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్లో రెండో రౌండ్లో వెనుదిరిగిన అతను.. ఈ సారి అంతకు మించిన ప్రదర్శన చేయడంపై ఫోకస్ పెట్టాడు. అయితే సుమిత్ నగాల్కు క్లే కోర్టుపై మెరుగైన రికార్డ్ ఉంది. ఎర్రమట్టి కోర్టులోనే జరిగే ఒలింపిక్స్ టెన్నిస్లో అతను ఎంతవరకూ వెళ్తాడన్నది ఆసక్తికరం.
మరోవైపు ఏటీపీ టూర్ టోర్నీల్లో ఇతర భాగస్వాములతో కలిసి బాలాజి కూడా రాణిస్తున్నాడు. మియామి మాస్టర్స్ టైటిల్ గెలిచాడు. అయితే ఒలింపిక్స్ కోసం జతకట్టిన బోపన్న-బాలాజి గతంలో ఎప్పుడూ కలిసి ఆడలేదు.