పారిస్ ఒలింపిక్స్ 2024 ఆరంభ వేడుకల్లో దాయదీ పాకిస్థాన్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం సెన్ నదీపై అంగరంగ వైభవంగా ఆరంభ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. నదీ తీరం వెంట ఫ్రెంచ్ పరిమళాల గుబాళింపులతో ఆతిథ్య దేశపు ఘనతలను ప్రదర్శిస్తూ కార్యక్రమాలు ఘనంగా సాగాయి. ఆయా దేశాల అథ్లెట్లు పడవల్లో తమ జాతీయ పతకాలతో అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
ఇక భారత్ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్లు 16 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆరంభ వేడుకల్లో 78 మంది ఆటగాళ్లు, అధికారులు పాల్గొనగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ అచంట.. పీవీ సింధు ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించారు.

అయితే పాకిస్థాన్ పరేడ్ సందర్భంగా ఆ జట్టు అథ్లెట్లకు తీవ్ర అవమానం ఎదురైంది. పాకిస్థాన్ జట్టు పరేడ్ సందర్భంగా ఓ కామెంటేటర్.. ఆ దేశ పరువు పోయేలా మాట్లాడాడు. పాకిస్థాన్లో 24 కోట్ల మంది ప్రజలు ఉంటే.. కేవలం ఏడుగురు మాత్రమే పారిస్ ఒలింపిక్స్ ఆడుతున్నారు'అని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్కాగా.. పాకిస్థాన్ జర్నలిస్ట్లు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. 'నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఆరంభ వేడుకల్లో పాకిస్థాన్ను చూసి ఏం మాట్లాడుతున్నారో విన్నారా? ఇందుకు ఎవరు బాధ్యులు'అంటూ పాకిస్థాన్ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా దేశంలో ఇతర క్రీడలను ప్రోత్సహించి వచ్చే ఒలింపిక్స్ వరకు అయినా ఎక్కువ మంది బరిలో నిలిచేలా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. ఇక పాకిస్థాన్ నుంచి ఏడుగరు అథ్లెట్లు మాత్రమే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. దాంతో అధికారులు, అథ్లెట్లు కలిసి మొత్తం 18 మంది ప్యారిస్కు వెళ్లగా.. ప్రారంభ వేడుకల్లో 11 మంది మాత్రమే పాల్గొన్నారు. పాక్ నుంచి బరిలో దిగిన ఏడుగురు అథ్లెట్లలో బళ్లెం వీరుడు అర్షద్ నదీంపై మాత్రమే మెడల్ సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి.