భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మరోసారి తమ పెద్ద మనసును చాటుకుంది. భారత్లో ఇతర క్రీడలను ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే బీసీసీఐ.. మరోసారి అండగా నిలిచింది. ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ 2024 బరిలోకి దిగే అథ్లెట్లకు భారీ సాయం ప్రకటించింది. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓఏ)కు రూ. 8.5 కోట్ల విరాళం అందజేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. '2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అథ్లెట్లకు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. మేము భారత ఒలింపిక్ అసోసియేషన్కు రూ. 8.5 కోట్లు అందిస్తున్నాం'అని జై షా ట్వీట్ చేశారు.

జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్లో మొత్తం 32 క్రీడల్లో 329 ఈవెంట్స్ల్లో అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్కు 111 మంది అర్హత సాధించారు. మొత్తం 16 క్రీడల్లో పోటీ పడనున్నారు. అచంట శరత్, పీవీ సింధులు ఆరంభ వేడుకల్లో భారత బృందానికి ఫ్లాగ్ బెరర్గా వ్యవహరించనున్నారు.
1920 నుంచి భారత అథ్లెట్లు ఒలింపిక్స్లో పోటీపడుతున్నారు. గత టోక్యో ఒలింపిక్స్లో 124 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగగా.. ఈ సంఖ్య ఈసారి 111కు పడిపోయింది. క్రీడల సంఖ్య కూడా 18 నుంచి 16కు తగ్గింది. టోక్యో ఒలింపిక్స్లో ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో అర్హత సాధించిన భారత ప్లేయర్లు.. ఈ సారి క్వాలిఫై కాలేకపోయారు.
టోక్యో ఒలింపిక్స్లో భారత్ 7 పతకాలు సాధించింది. ఇందులో నీరజ్ చోప్రా బంగారు పతకం ఉండగా.. మీరాభాయి చాను, రవికుమార్ దహియా రజత పతకాలు సాధించింది. పీవీ సింధు, లోవ్లీనా బోర్గోహైన్, బజరంగ్ పూనియాలు కాంస్య పతకాలు సాధించారు.