పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లర్ అమన్ సహ్రావత్ సత్తా చాటాడు. పురుషుల 57 కేజీల ప్రిక్వార్టర్స్లో అమన్ 10-0 తేడాతో వాద్లిమిర్(నార్త్ మాసిడోనియా)ని ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరాడు.
తొలి రౌండ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై అమన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి రౌండ్లో వాద్లిమిర్ను రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్స్ సాధించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి మరో రెండు పాయింట్స్ రాబట్టాడు. రెండో రౌండ్లో కూడా ఇదే జోరు కనబర్చి ప్రత్యర్థిని మట్టికరిపించాడు.

అంశుమాలిక్ ఓటమి..
మరోవైపు మహిళల 57 కేజీల ప్రిక్వార్టర్స్లో అంశుమాలిక్ తీవ్రంగా నిరాశపర్చింది. గురువారం జరిగిన పోరులో 2-7 తేడాతో హెలెన్ లూయిస్(అమెరికా) చేతిలో ఓటమిపాలైంది. తొలి రౌండ్లో అమెరికా రెజ్లర్ రెండు పాయింట్స్ సాధించింది. రెండో రౌండ్లో ఆమె మరింత జోరు పెంచింది. అంశును రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్స్ తన ఖాతాలో వేసుకుంది. భారత్ రెజ్లర్ చివర్లో రెండు పాయింట్స్ రాబట్టినా ఫలితం లేకపోయింది. హెలెన్ ఫైనల్ చేరితే మాలిక్కు రెపిచేజ్ రౌండ్ ద్వారా కాంస్య పోరులో పాల్గొనే అవకాశం దక్కుతుంది.