పారిస్ ఒలింపిక్స్ 2024కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో అనధికారికంగా.. 48 గంటల్లో అధికారికంగా ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. ఇప్పటికే ఆయా దేశాల అథ్లెట్లు పారిస్ చేరి అక్కడి పరిస్థితులకు అలవాటు ప్రయత్నం చేస్తున్నారు. భారత అథ్లెట్లు సైతం పారిస్లో అడుగుపెట్టి ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు.
టేబుల్ టెన్నిస్ క్రీడలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. సాధారణంగా టేబుల్ టెన్నిస్.. మనకు సంబంధం లేని ఆటలా అనిపిస్తోంది. ఎందుకంటే చైనా, జపాన్, కొరియా వంటి దేశాలే పతకాలన్నీ గెలుస్తాయి. కానీ ఈసారి భారత టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు పతకాలపై ఆశలు రేపుతున్నారు.

శ్రీజపైనే ఆశలు..
మహిళల సింగిల్స్లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజతో పాటు స్టార్ ప్లేయర్ మనిక బత్రా బరిలోకి దిగుతుండగా.. పురుషుల విభాగంలో శరత్ కమల్ పోటీ పడుతున్నాడు. మనిక బత్రా, శరత్ కమల్ కంటే తెలుగమ్మాయి ఆకుల శ్రీజ వరుస విజయాలతో జోరు మీదుంది.
2022 కామన్వెల్త్ గేమ్స్లో శరత్ కమల్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం గెలిచిన శ్రీజ.. ఈ ఏడాది డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ టోర్నీ.. డబ్ల్యూటీటీ కంటెండర్ టైటిళ్లు సాధించింది. వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలోనూ ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ను ఓడించింది. కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్ అర్హత సాధించిన ఆకుల శ్రీజ.. పతకాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
మనిక బత్రా.. ఈసారైనా..!
మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో నిరాశపరిచిన మనిక బత్రా.. ఈ సారైనా సత్తా చాటాలనే లక్ష్యంతో ఉంది. 2022 ఆసియాకప్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు సాధించింది. మహిళల విభాగంలో మూడో ప్లేయర్గా అర్చన కామత్ అర్హత సాధించింది. అయితే ఈమెపై పెద్దగా అంచనాలు లేవు.
41 ఏళ్ల శరత్...
కెరీర్లో ఐదోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న 41 ఏళ్ల శరత్ కమల్.. మెడల్ సాధించి తన కెరీర్ను ఘనంగా ముగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అతని అపారమైన అనుభవం యువ ప్లేయర్లకు ఉపయోగపడనుంది. గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న శరత్ ఈసారి పతకం సాధించేలా కనిపిస్తున్నాడు. పురుషుల సింగిల్స్లో శరత్ కమల్తో పాటు హర్మీత్ దేశాయ్, మానవ్ థక్కర్ బరిలోకి దిగనుండగా... రిజర్వ్ ఆటగాడిగా సత్యన్ పారస్ వెళ్లనున్నాడు.