పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ టీమ్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ షూటౌట్లో 4-2 తేడాతో గ్రేట్ బ్రిటన్ను ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గోల్ కీపర్ శ్రీజేష్ అసాధారణ ప్రదర్శనతో భారత్ విజయాన్నందుకుంది.
నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 సమంగా నిలవడంతో షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. భారత్ తరఫున హర్మన్ప్రీత్ కౌర్(22వ నిమిషం) ఏకైక గోల్ చేయగా.. గ్రేట్ బ్రిటన్ తరఫున లీ మోర్టన్(27వ నిమిషం) గోల్ నమోదు చేశాడు.

10 మందితోనే భారత్..
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్ట్ క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే సెకండ్ క్వార్టర్ ఆరంభంలోనే భారత్కు బిగ్ షాక్ తగిలింది. భారత ప్లేయర్ అమిత్ రోహిడాస్ రెడ్ కార్డ్తో మైదానం వీడాడు. ప్రత్యర్థి ఆటగాడు గాయపడేలా దురుసుగా ప్రవర్తించాడని అతన్ని రిఫరీ మైదానం బయటకు పంపించాడు. దాంతో భారత్.. మ్యాచ్ ఆసాంతం 10 మందితోనే ఆడింది.
రోహిడాస్ మైదానం వీడిన కాసేపటికే భారత్ గోల్ నమోదు చేసింది. 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ సింగ్ అద్భుతంగా గోల్గా మలిచి 1-0తో ఆధిక్యాన్ని అందించాడు. పారిస్ ఒలింపిక్స్లో హర్మన్ప్రీత్కు ఇది ఏడో గోల్ కావడం విశేషం.
5నిమిషాల వ్యవధిలోనే..
అయితే ఈ ఆనందం క్షణాల్లో ఆవిరి అయింది. 5 నిమిషాల వ్యవధిలోనే గ్రేట్ బ్రిటన్ గోల్ నమోదు చేసి స్కోర్లను 1-1తో సమం చేసింది. 27వ నిమిషంలో లీ మోర్టన్ అద్భుత షాట్తో బంతిని గోల్ పోస్ట్లోకి పంపించాడు. ఆ తర్వాత బంతిని పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకున్న గ్రేట్ బ్రిటన్.. భారత రక్షణ శ్రేణిని చేధిస్తూ పదే పదే గోల్ పోస్ట్పై దాడి చేసింది. భారత్ 10 మందితో ఆడుతుండటాన్ని గ్రేట్ బ్రిటన్ అడ్వాంటేజ్గా మార్చుకుంది.
శ్రీజేష్ సూపరో సూపర్..
ఇక గ్రేట్ బ్రిటన్ గోల్ ప్రయత్నాలను భారత కీపర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. దాదాపు 12 గోల్స్ ప్రయత్నాల్లో 11 గోల్స్ను అడ్డుకున్నాడు. దాంతో మ్యాచ్ సమయం ముగిసే వరకు ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో ఫలితం కోసం షూటౌట్ ఆడించారు.
షూటౌట్లో తొలి రెండు ప్రయత్నాల్లో గ్రేట్ బ్రిటన్ గోల్స్ నమోదు చేయగా.. భారత ఆటగాళ్లు హర్మన్ప్రీత్, సుఖ్జీత్ సమం చేశారు. గ్రేట్ బ్రిటన్ మూడో ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకోగా.. భారత్ నుంచి లలిత్ గోల్ నమోదు చేసి 3-2తో ఆధిక్యాన్ని అందించాడు. నాలుగో ప్రయత్నంలోనూ గ్రేట్ బ్రిటన్ విఫలమవ్వగా.. భారత్ నుంచి రాజ్కుమార్ గోల్ నమోదు చేసి 4-2తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. మ్యాచ్తో పాటు షూటౌట్లో రెండు గోల్స్ అడ్డుకొని శ్రీజేష్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.