భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆసుపత్రి పాలైంది. ఒలింపిక్స్ చరిత్రలోనే ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర్ చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్కు కీలక పోరు ముందు ఊహించని షాక్ తగిలింది. మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో పోటీపడిన వినేష్ ఫొగట్పై అనర్హత వేటు పడింది.
50 కేజీల కంటే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండటంతో ఫైనల్ ఆడకుండా వినేష్ ఫోగట్పై ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో వినేష్ ఫోగట్ పతకం లేకుండానే వెనుదిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

షెడ్యూల్ ప్రకారం బుధవారం అమెరికా రెజ్లర్ సారా హిండెబ్రాండ్తో వినేష్ ఫోగట్ తలపడాల్సి ఉంది. వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడిందని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. వినేష్ ఫోగట్ బరువు విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. సాధారణంగా 50 కేజీల విభాగంలో ఉన్న వాళ్లు 52 కేజీల బరువు వరకు ఉండొచ్చు. కానీ వినేశ్.. అంత కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
రాత్రంతా మేలుకొని స్కిప్పింగ్, రన్నింగ్ చేసినా లాభం లేక పోయింది. భారత మేనేజ్మెంట్ మరి కొంత సమయం ఇవ్వాలని కోరినా పారిస్ ఒలంపిక్స్ కమిటీ వినలేదని తెలుస్తున్నది. వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై కావడంతో మహిళల ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో గోల్డ్, బ్రాంజ్ మాత్రమే ప్రదానం చేయనున్నారు. ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
రాత్రంతా నిద్రహారాలు మాని బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించిన వినేష్ ఫోగట్ ఆసుపత్రిపాలైనట్లు తెలుస్తోంది. డీహైడ్రెషన్కు గురైన ఆమెకు సెలైన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్లో వినేష్ ఫోగట్ సంచలన విజయాలు అందుకుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకీ(జపాన్)ను 3-2తో ఓడించింది. చివరి 10 సెకన్లలోనే ఈ విజయానికి కావాల్సిన పాయింట్స్ను వినేష్ ఫోగట్ నమోదు చేసింది. ఈ గెలుపుతో వినేష్ ఫోగట్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
అనంతరం అదే జోరులో 7-5తో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ను ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఇక సెమీఫైనల్లో 5-0తో క్యూబా ప్లేయర్ యుస్నీలీస్ గుజ్మాన్ను తనదైన శైలిలో మట్టికరిపించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ అధిక బరువు కారణంగా పోటీల నుంచి డిస్క్వాలిఫై అయ్యింది. వినేష్ ఫోగట్ పరిస్థితిని చూసి యావత్ భారత్ చలించిపోతుంది.