
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ పోటీల్లో హర్విందర్ సింగ్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. పారాలింపిక్స్ ఆర్చరీ విభాగంలో భారత్కు తొలి పతకం అందించిన అథ్లెట్గా నయా చరిత్ర సృష్టించాడు. గతంలో 2018 ఆసియా పారా క్రీడల్లో తొలిసారి స్వర్ణం సాధించిన హర్విందర్ ఇప్పుడు విశ్వ క్రీడల్లో కాంస్యంతో మెరిసాడు. కొరియన్ అథ్లెట్ కిమ్తో శుక్రవారం జరిగిన బ్రాంజ్ మెడల్ ఫైట్లో హర్విందర్ 6-5 (26-24, 27-29, 28-25, 25-25, 26-27) (10-8) తేడాతో గెలుపొందాడు. అంతకుముందు సెమీఫైనల్స్లో అమెరికా అథ్లెట్ కెవిన్ మాదర్ చేతిలో 6-4 (25-28, 24-24, 25-25, 25-24, 24-26) తేడాతో ఓటమిపాలయ్యాడు.
మరోవైపు ఈ ఉదయం ప్రవీణ్ కుమార్ హైజంప్లో రజతం సాధించగా.. అవనీ లేఖరా 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్హెచ్ 1 పోటీల్లో కాంస్య పతకం సాధించింది. దాంతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు సాధించిన తొలి ఇండియన్గా చరిత్రకెక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన అవని లేఖరా.. ఇప్పటికే పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.
హైజంప్ ఫైనల్స్లో గ్రేట్ బ్రిటన్కు చెందిన జోనాథన్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో ప్రవీణ్ కుమార్ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. పోలాండ్కు చెందిన మసీజ్ లెపియాటోకు బ్రోన్జ్ మెడల్ దక్కింది.
విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లను ఆదర్శంగా తీసుకొని పారా అథ్లెట్లు కూడా తమదైన శైలిలో విజృంభిస్తున్నారు. పారాలింపిక్స్ 2020లో భారత్ పతకాల సంఖ్య 13కు చెరింది. ఇందులో రెండు గోల్డ్ (అవని లేఖరా, సుమిత్ అంటిల్), ఆరు సిల్వర్ (ప్రవీణ్ కుమార్, మరియప్ప తంగవేల్, దేవేంద్ర ఝజారియా, యోగేష్ కథునియా, నిషద్ కుమార్, భవీనాబెన్ పటేల్), ఐదు బ్రాంజ్ (శరద్ కుమార్, సిఘ్రాజ్ అధనా, సుందర్ సింగ్ గుర్జర్, అవని లేఖరా, హర్విందర్ సింగ్) మెడల్స్ ఉన్నాయి.