పారాలింపిక్స్ 2024లో భారత పారా ఆర్చర్ శీతల్ దేవి తృటిలో మెడల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె చూపిన పోరాటం మాత్రం క్రీడా ప్రపంచాన్ని ఆకట్టుకుంది. 17 ఏళ్ల వయసులో అసాధారణ ప్రదర్శన కనబర్చిన శీతల్ దేవి.. పతకం సాధించకపోయినా.. మనసులు గెలుచుకుంది.
మహిళల వ్యక్తిగత విభాగంలో పోటీ పడిన శీతల్ తన తొలి షాట్లోనే టార్గెట్ను కొట్టి 10 పాయింట్లు సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లతో పాటు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ఫిదా అయ్యారు. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, బార్సిలోనా ఫుట్బాల్ స్టార్ జౌలెస్ కుందె శీతల్ దేవి ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపించారు.

'ప్రపంచంలోనే అతికొద్ది మంది మాత్రమే ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో శీతల్ ఒకరు. కాలితోనే విల్లు ఎత్తి పది పాయింట్లకు గురి పెట్టి కొట్టడం సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. వ్యక్తిగత విభాగంలో శీతల్ తన కాళ్లతో పోటీపడగా.. ప్రత్యర్థి వీల్ చైయిర్లో చేతులతోనే బాణం సంధించింది. శీతల్ వీడియోను కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శేఖర్ దత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి శీతల్ ధన్యవాదాలు చెబుతూ రీపోస్ట్ చేసింది.
'కోట్లాది మందికి శీతల్ స్ఫూర్తి ప్రదాత. ఇలానే మున్ముందు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా'అని శేఖర్ దత్ కొనియాడగా.. 'ఇది సాధ్యం కానిది. కవితల్లోనే నమ్మశక్యం కాని ఫీట్ను సాధించడం అభినందనీయం. ఆర్మ్ లేకుండా జన్మించిన శీతల్ స్థాయికి చేరుకోవడం నిజమైన హీరో లక్షణం'అని ఎరిక్ సోల్హెమ్ కామెంట్ చేశాడు. 'పారాలింపిక్స్లో పోటీపడే ప్రతీ ఒక్కరూ అద్భుతమే. టాలెంట్కు వైకల్యం అడ్డు కాదని నిరూపించారు'అని ఓ నెటిజన్ ప్రశంసించారు.