పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే గత రికార్డులను చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించిన భారత పారా అథ్లెట్ల బృందం.. గురువారం మరో పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
పురుషుల జూడో 60 కేజీల జే1 విభాగంలో భారత స్టార్ కపిల్ పర్మార్ కాంస్య పతకం సాధించాడు. బ్రాంజ్ మెడల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ కపిల్ 10-0 తేడాతో ఎలీల్టన్(బ్రెజిల్)ను చిత్తు చేశాడు. 33 సెకన్లలోనే ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ప్రత్యర్థి వీపు మ్యాట్కు తగిలేలా కింద పడేసి విజేతగా నిలిచాడు. సోటో మకికోమి టెక్నిక్తో ప్రత్యర్థిని పడగొట్టాడు. తన కుడి కాలితో ప్రత్యర్థి ఎడమ కాలిని వంచిన కపిల్.. అతన్ని పైకి లేపి వీపు కింద తగిలేలా పడేశాడు.

సెమీస్లో కూడా కపిల్ ఇలాగే ఇరాన్ ప్లేయర్ అబాదిని కిందపడే ప్రయత్నం చేశాడు. కానీ విజయాన్ని అందుకోలేకపోయాడు. జూడో ఆటలో పతకం సాధించిన తొలి భారత పారా అథ్లెట్గా కపిల్ చరిత్ర సృష్టించాడు.
మరోవైపు మహిళల 48 కేజీల జే2 క్వార్టర్స్లో కోకిల 0-10తో కజకిస్థాన్ ప్లేయర్ నాట్బెక్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం రేపిచేజ్లోనూ ఆమె 0-10తో యులియా(ఉక్రెయిన్) చేతిలో ఓటమిపాలైంది.
తృటిలో చేజారిన పతకం..
పారా ఆర్చరీలో భారత్కు మరో పతకం తృటిలో చేజారింది. పారా ఆర్చరీ మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఓపెన్ కాంస్య పతక పోరులో హర్విందర్ సింగ్-పూజ జాత్యన్ షూటాఫ్లో 4-5తో డెజాన్-జివా(స్లోవేనియా) చేతిలో పోరాడి ఓడింది. తొలి రౌండ్లో 33-30తో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ తర్వాతి రౌండ్లో 29-34తో తడబడింది. మూడో రౌండ్లో 38-33తో తిరి జోరు చూపించినా.. నాలుగో రౌండ్లో 29-34 తేడాతో 4-4తో స్కోర్లు సమం చేసింది. కానీ షూటాఫ్లో ప్రత్యర్థి ద్వయం 19 స్కోర్ చేయగా.. భారత్ జోడీ 17 పాయింట్స్ మాత్రమే సాధించింది.
భారత్@25
పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య 25కి చేరింది. 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యలతో పతకాల టేబుల్స్లో 16వ స్థానంలో కొనసాగుతోంది. 163 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. 82 మెడల్స్తో బ్రిటన్, 77 పతకాలతో అమెరికా టాప్-3లో కొనసాగుతున్నాయి. పారాలింపిక్స్ చరిత్రలోనే భారత్ 25 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. టోక్యో పారాలింపిక్స్లో 19 పతకాలే సాధించారు.