ఇక పారాలింపిక్స్.. భారత్ నుంచి బరిలో 54 మంది!

న్యూఢిల్లీ: నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ స్వర్ణంతో టోక్యో ఒలింపిక్స్ను చిరస్మరణీయం చేసుకున్న భారత్.. అదే వేదికపై మళ్లీ పతకాల వేటకు వెళ్లింది. పారాలింపిక్స్లో పాల్గొనేందుకు 54 మంది సభ్యులతో కూడిన భారత జట్టు గురువారం టోక్యో పయనమైంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ బృందానికి సాదర వీడ్కోలు పలికారు. ఈనెల 24న ప్రారంభమయ్యే పారాలింపిక్స్ సెప్టెంబరు ఐదున ముగ్చియనున్నాయి. తొమ్మిది క్రీడాంశాలలో భారత్ తలపడుతోంది. టోక్యోలోని ఒలింపిక్స్ విలేజ్లోనే ఈ దివ్యాంగ విశ్వక్రీడలు జరుగనున్నాయి. భారత ఆటగాళ్లు పోటీ పడే ఈవెంట్లు 27న మొదలవుతాయి. ముందుగా ఆర్చరీ పోటీలు జరుగుతాయి.

రియోలో నాలుగు మెడల్స్..
పారాలింపిక్ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్-46 జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (టి-63 హైజంప్), ప్రపంచ చాంపియన్ సందీప్ చౌదరి (ఎఫ్-64 జావెలిన్ త్రో) ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. దేవేంద్ర మూడో స్వర్ణంపై కన్నేశాడు. తను ఇదివరకే ఏథెన్స్(2004), రియో (2016) పారాలింపిక్స్లో బంగారు పతకాలు నెగ్గాడు. గత పారాలింపిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది. మన జట్టు దిగ్విజయంగా పతకాలతో తిరిగి రావాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, భారత పారాలింపిక్ సంఘం అధికారులు గురువారం జరిగిన 'వర్చువల్ సెండాఫ్' ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగనంపారు. 'మన పారా అథ్లెట్ల లక్ష్యం, ఆత్మవిశ్వాసం 130 కోట్లమంది భారతీయులలో స్ఫూర్తి నింపుతుంది. వారి ధైర్యానికి పెను సవాళ్లు కూడా తలవంచుతాయి' అని వీడియో సందేశంలో ఠాకూర్ పేర్కొన్నారు.

స్పోర్ట్స్ అవార్డ్స్ ఆలస్యం..
ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆలస్యం కానుంది. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ వర్ధంతి రోజైన ఆగస్టు 29న ప్రతిఏటా క్రీడా అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు. అయితే ఈ నెల 24 నుంచి సెప్టెంబరు 5 వరకు జరగనున్న టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్టు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. 'ఈ ఏడాది పురస్కారాల ఎంపికకు ఇప్పటికే జాతీయ స్పోర్ట్స్ అవార్డు కమిటీని కూడా ఏర్పాటు చేశాం. కానీ, టోక్యో పారాలింపిక్స్ జరగాల్సివుంది. ఈ క్రీడల విజేతలను కూడా క్రీడా పురస్కారాలకు ఎంపిక చేయాలనుకుంటున్నాం. ఈ మెగా ఈవెంట్లో పారాథ్లెట్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తున్నా' అని ఠాకూర్ అన్నారు.

భారత్7
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో భారత్ రికార్డు స్థాయిలో 7 పతకాలు నెగ్గిన విషయం తెలిసిందే. మహిళా వెయిట్లిఫ్టర్ మీరాభాయి చాను రజతంతో ఖాతా తెరవగా.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో ఘనమైన ముగింపును అందించాడు. రెజ్లర్ రవిదహియా రజతం గెలవగా.. బాక్సర్ లవ్లీనా, భారత పురుషలు హాకీ జట్టు, రెజ్లర్ బజరంగ్ పూనియా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కాంస్యపతకాలు అందుకున్నారు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు ఇది అత్యుత్తమమైన ప్రదర్శన. 2012 లండన్ ఒలింపిక్స్లో భారత్ 6 పతకాలు అందుకుంది. తాజాగా ఆ సంఖ్య అధిగమించింది. ఓవరాల్గా ఈసారి 48వ స్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications